హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎంను ఢీకొట్టడానికి కేంద్ర మంత్రులంతా క్యూ కట్టారని ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా పాతబస్తీలోని ఖిల్వాత్ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతలపై మండిపడ్డారు. మొన్న యోగి, మోదీ, ఇవ్వాళ అమిత్ షా… ఎంఐఎం ను ఢీ కొట్టడానికి క్యూ కట్టిర్రు.. మోదీ బయో టెక్ గురించి వచ్చారు.. ఆయన కూడా ఎన్నికల గురించి మాట్లాడి పోతే ఐపోతుండె అని ఒవైసీ అన్నారు. యూపీ సీఎం యోగి నిన్న వచ్చి ప్రగల్భాలు పలికిండు… హత్రస్ ఘటన లో బాధితులకు న్యాయం చేయని వ్యక్తి యోగి.. అయన హైదరాబాద్ వచ్చి మాట్లాడడం సిగ్గు చేటు.. యూపీ లో మొత్తం ఠాకూర్ హవా నడుస్తోంది.. యోగినే పెద్ద ఠాకూర్ అని ఆరోపించారు. మతకల్లోలాలు సృష్టిస్తున్నాం అని ఎంఐఎం పై బురద జల్లుతున్నారని పేర్కొన్నారు. రోయిన్గ్యాల పై లెక్కలు నన్ను అడిగితే ఎట్లా.. ? మీరే తెలుసుకుని చెప్పండని ఒవైసీ ఎదురు ప్రశ్నించారు. మత రాజకీయాలు చేస్తున్నదే బీజేపీ పార్టీ… కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ కు ఇచ్చింది ఏమి లేదని అసదుద్దీన్ ఒవైసీ దుయ్యబట్టారు.