తగ్గుతున్న కరోనా కేసులు.. అన్‌‌లాక్ యోచనలో రాష్ట్రాలు

తగ్గుతున్న కరోనా కేసులు.. అన్‌‌లాక్ యోచనలో రాష్ట్రాలు

న్యూఢిల్లీ: దేశంలో విలయతాండవం సృష్టించిన కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుతూ వస్తోంది. పలు దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా ప్రభావం తగ్గనప్పటికీ.. కొన్ని రాష్ట్రాల్లో నమోదవుతున్న కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో అన్‌‌లాక్ దిశగా పలు రాష్ట్రాలు అడుగులు వేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో మే 31 నుంచి అన్‌లాక్ ప్రక్రియ మొదలైంది. జూన్ 7 నుంచి ఢిల్లీలో మెట్రో సేవలు 50 శాతం కెపాసిటీతో షురూ కానున్నాయి. అలాగే మార్కెట్‌‌లు, మాల్స్ కూడా సరి, బేసి పద్ధతిలో తెరుచుకోనున్నాయి. 

ఉత్తర్ ప్రదేశ్‌‌లో కూడా ఈనెల 7 నుంచి లాక్‌డౌన్ సడలింపులు ఉంటాయని యోగి సర్కార్ తెలిపింది. కంటైన్‌‌మెంట్ జోన్‌‌ల్లో వారంలో ఐదు రోజులపాటు మార్కెట్‌లు, షాపులు తెరుచుకోవచ్చునని స్పష్టం చేసింది. అయితే నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్ మాత్రం కొనసాగుతుందని పేర్కొంది. రాజస్థాన్‌‌లో ఈనెల 2వ తేదీ నుంచి అన్‌‌లాక్ ప్రక్రియ మొదలైంది. పలు సడలింపులతో అన్‌‌లాకింగ్‌‌ను అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం ఇప్పటికే స్టార్ట్ చేసింది. మన రాష్ట్రంలో ఈ నెల 9 వరకు లాక్‌‌డౌన్ కొనసాగనుంది. ఆ తర్వాత లాక్‌‌డౌన్‌ను కొనసాగిస్తారా లేదా సడలింపులతో అన్‌లాక్ ప్రక్రియను మొదలెడతారా అనేది త్వరలో తేలనుంది.