
పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదుల ఏరివేసే ప్రక్రియను స్పీడప్ పెంచింది. ఇందులో భాగంగా భారత్ లో ఉంటూ పాకిస్తాన్ కు సహకరించిన వారిని అరెస్ట్ చేస్తోంది. పాకిస్థాన్ సీక్రెట్ సర్వీసెస్ ఏజెన్సీ (ఐఎస్ఐ) ఏజెంట్గా పని చేస్తోందన్న ఆరోపణలపై హర్యానాకు చెందిన ట్రావెల్ వ్లాగర్, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను హర్యానా పోలీసులు శనివారం (మే 17) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ కు ఏజెంట్ గా పనిచేస్తున్నాడనే ఆరోపణలతో లేటెస్ట్ గా రాంపూర్కు చెందిన ఒక వ్యాపారవేత్తను ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
వ్యాపారవేత్త షాజాద్ పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) కోసం గూఢచర్యం, అక్రమ రవాణాకు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఇంటిలిజెన్స్ సమాచారం మేరకు షాజాద్ ను మొరాదాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. సరిహద్దు నుంచి కాస్మోటిక్స్, దుస్తులు , సుగంధ ద్రవ్యాలు వంటి వస్తువులను అక్రమంగా రవాణా చేస్తున్నాడు. వ్యాపారాన్ని అడ్డంపెట్టుకుని పాకిస్తాన్ ఏజెంట్లకు సున్నితమైన జాతీయ భద్రతా సమాచారాన్ని అందజేసినట్లు కూడా అతనిపై ఆరోపణలు ఉన్నాయి. షాజాద్ భారత్ లో సిమ్ కార్డులు కొని ISI - ఏజెంట్లకు అందించడమే గాకుండా పలువురు యువకులను కూడా ఉగ్రవాదం వైపు మళ్లించడానికి ప్రోత్సహించాడని అధికారులు తెలిపారు.
మే 17న పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేశారన్న ఆరోపణలపై ఆరుగురు భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ప్రముఖ ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కూడా ఉన్నారు. హర్యానా, పంజాబ్లో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో వారంతా ముఠాగా ఏర్పడి గూఢచర్యం చేస్తున్నారు. ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ చానెల్ నడుపుతున్న జ్యోతి.. కమీషన్ ఏజెంట్ల సాయంతో వీసా పొంది 2023లో పాకిస్తాన్ లో పర్యటించింది. తన పర్యటనలో ఎషానుర్ రహీం అలియాస్ డానిష్ అనే వ్యక్తితో పరిచయం చేసుకుని సంబంధాలు పెంచుకుంది. డానిష్ న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ లో స్టాఫ్ మెంబర్ గా పనిచేస్తున్నాడు. జ్యోతిని డానిష్ పలువురు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్(పీఐఓ) కు పరిచయం చేశాడు. గ్యులర్ గా అతనితో టచ్ లో ఉంటూ వాట్సాప్, టెలిగ్రాంలో దేశానికి సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ను ఆమె షేర్ చేసింది. డానిష్ తో ఆమె రొమాంటిక్ రిలేషన్ షిప్ కూడా నెరిపింది. పాక్ కు వెళ్లేందుకు ఆమెకు వీసా ఇప్పించడంలో డానిష్ సాయం చేశాడు.