ఉప్పల్ మ్యాచ్ టికెట్ల కోసం ఫ్యాన్స్ తిప్పల్

ఉప్పల్ మ్యాచ్ టికెట్ల కోసం ఫ్యాన్స్ తిప్పల్
  • పలుచోట్ల పోలీసుల బందోబస్తు

వీ6 వెలుగు డిజిటల్: హైదరాబాద్ ఉప్పల్ వేదికగా 18న జరగనున్న ఇండియా –న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ టికెట్ల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. టికెట్ల కొనుగోలుకు ఈ సాయంత్రం వరకు అవకాశం ఉన్నది. అయితే పేటీఎంలో ఎర్రర్ వస్తోందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు మరో 9417 టికెట్ల అమ్మకాలు జరగనున్నాయి. మరోవైపు హెచ్‭సీఏ తీరుపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆన్‭లైన్‭లో పెట్టిన అరగంటలోపే వేలాది టికెట్లు సేల్ అయ్యాయి. ఈ మ్యాచ్ కోసం 14న 6 వేల, 15న 7 వేల టికెట్లు ఆన్‭లైన్‭లో అమ్ముడయ్యాయి. ఇప్పటివరకు ఆన్‭లైన్‭లో 20వేల టికెట్లను హెచ్‭సీఏ అధికారులు విక్రయించారు. 

ఆన్ లైన్ లో బుకింగ్ ఆఫ్ లైన్ లో టికెట్స్

ఆన్‭లైన్‭లో టికెట్స్ బుక్ చేసుకున్నవారికి సోమవారం నుంచి ఫిజికల్ టికెట్స్ ఇస్తున్నారు. దీనికోసం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం, ఎల్బీ స్టేడియంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఆన్‭లైన్‭లో బుక్ చేసుకున్నట్టు మెసేజ్ చూపించిన వారినే స్టేడియంలోపలికి అనుమతి ఇస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో 8 కౌంటర్ల ను ఏర్పాటు చేశారు. బందోబస్తు కోసం 75 మంది పోలీసుల సేవలను వినియోగిస్తున్నారు.  గచ్చిబౌలి స్టేడియంలో 8 కౌంటర్లు ఏర్పాటు చేసి 80 మంది పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేశారు. మహిళలు, పురుషుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఉన్నాయి. క్యూఆర్‌ కోడ్‌ చూపిస్తే.. స్కాన్‌ చేసి పేటీఎం సిబ్బంది ఫిజికల్ టికెట్లను ఇస్తున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు మరో 7 వేల టికెట్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు హెచ్‌సీఏ వెల్లడించింది.

టికెట్ పై 10 శాతం అదనపు ఛార్జీలు

టికెట్స్ మీద ఉన్న రేటుతో సంబంధం లేకుండా అదనపు చార్జీలు  వసూలు చేస్తున్నారంటూ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఒక్క టికెట్ ఫై 10 శాతం వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు. పేటీఎం, HCA  ఆర్థిక లావాదేవీలు చూసుకోవాలి.. కానీ ఫాన్స్ ఫై అదనపు చార్జ్  ఎలా వసూలు చేస్తారంటూ HCA తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.