
హైదరాబాద్ సిటీ, వెలుగు: చీటింగ్ చేసి రూ.24.36 కోట్లు మోసం చేసిన కేసులో ఇద్దరు ప్రధాన నిందితులను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం వారు వెల్లడించారు. అర్బన్ మార్కెట్ అనే ఆన్లైన్ గ్రాసరీ యాప్ ద్వారా వ్యాపార పెట్టుబడుల పేరుతో సామాన్య ప్రజల నుంచి ముఖేశ్ చౌదరి, అమిత్ కుమార్ భారీ మొత్తాలను సేకరించి, బాధితులను రూ. 24.36 కోట్ల వరకూ మోసం చేసినట్లు తేలింది.
ఈ విచారణను ఇన్స్పెక్టర్ జి. లింగేశ్వర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించగా.. సాక్షులను విచారించి, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ) రికార్డులు, నిందితులు , బాధితుల బ్యాంక్ స్టేట్మెంట్లను సేకరించి, చార్టర్డ్ అకౌంటెంట్ సహాయంతో విశ్లేషించారు. దీంతో నిందితుల బాగోతం బయటపడింది. నమ్మదగిన సమాచారం ఆధారంగా ప్రత్యేక బృందంగా పోలీసులు వెళ్లి.. చైతన్యపురి ప్రాంతంలో ఉంటున్న పిలానీ , అమిత్ కుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.