- అట్లాంటాలో ఘటన
- మిన్నంటిన నిరసనలు, పోలీస్ ఆఫీసర్ రిజైన్
అట్లాంటా: అమెరికాలోని అట్లాంటాలో పోలీసులు మరోసారి నల్లజాతీయుడిపై కాల్పులు జరపడంతో అతడు ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. దీంతో అల్లాంటా వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ అట్లాంటా పోలీస్ చీఫ్ వెంటనే రిజైన్ చేశారని మేయర్ కైశా లాన్స్ బొటోంస్ ప్రకటించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. రెషార్డ్ బ్రూక్ (27) అనే వ్యక్తి అట్లాంటాలోని వెండీ రెస్టారెంట్ ఎదురుగా కార్ పార్క్ చేసి అందులోనే నిద్రపోయాడు. కారు అడ్డుగా ఉండటంతో కస్టమర్లు ఇబ్బందులు పడ్డుతున్నారని, రెస్టారెంట్ ఓనర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు అతడిని మత్తులో ఉన్నట్లు గుర్తించారు. అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా.. అతడు పారిపోయాడు. పోలీసులు దగ్గర ఉన్న గన్ తీసుకుని వాళ్లనే కాల్చేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతడి కాళ్ల దగ్గర కాల్చగా.. తీవ్రంగా గాయపడ్డాడు. హాస్పిటల్కు తరలించగా ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయ్యిందని, దాని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. అయితే దీనిపై బ్రూక్ కుటుంబసభ్యులు ఇంకా స్పందించలేదు. అమెరికా మినియాపోలిస్లో జార్జ్ ఫ్లాయిడ్ అనే వ్యక్తిపై పోలీసు ఆఫీసర్ దాడి చేయడంతో చనిపోయాడు. దీంతో అమెరికాలో గత కొద్ది రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా.. ఇప్పుడు ఈ ఘటన జరగడంతో మళ్లీ నిరసనలు మొదలయ్యాయి.