
అమెరికాలో ఇప్పటి వరకు 10 లక్షల మందికి కరోనా టెస్టులు చేశామని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనాపై తాము గట్టిగా పోరాడుతున్నామన్నారు. కరోనాపై యుద్ధంలో ఈ రోజు ఒక హిస్టారిక్ మైల్ స్టోన్ చేరుకున్నాం. పది లక్షల మంది అమెరికన్లకు కరోనా టెస్టులు పూర్తి చేశాం. ప్రపంచంలో ఏ దేశమూ ఈ నంబర్ కు దరిదాపుల్లో కూడా పరీక్షలు చేయలేదు. అని చెప్పారు ట్రంప్. అమెరికాలో ప్రతి రోజూ లక్ష మంది శాంపిల్స్ సేకరించి కరోనా టెస్టులు చేస్తున్నామని ఈ సందర్భంగా ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి అలెక్స్ అజర్ తెలిపారు.
చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. రోజు రోజుకీ వేలు దాటి లక్షల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం మధ్యాహ్నం నాటికి కరోనా కేసుల సంఖ్య 7 లక్షల 78 వేలకు చేరింది. అందులో 37,800 మంది మరణించగా.. లక్ష 66 వేల మంది పూర్తిగా కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అమెరికాలో అత్యధికంగా లక్ష 64 వేల మంది వైరస్ బారినడ్డారు. వీరిలో 3 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఇటలీలో లక్ష మందికి కరోనా సోకింది. అందులో 11 వేల మంది మరణించారు. స్పెయిన్ లో 87,900 మంది ఈ మహమ్మారి బారినపడగా.. 7,700 మంది బలయ్యారు. ఇక వైరస్ పుట్టిన చైనాలో సుమారు 82 వేల మంది దీని బారినపడగా.. 3,305 మంది మరణించారు. భారత్ లో 1400 మందికి పైగా వైరస్ సోకింది. అందులో 140 మంది కోలుకున్నారు. 47 మంది ప్రాణాలు కోల్పోయారు.