
- పూమా, నైకి నకిలీలతో అమెరికా వెళ్తున్న ఇండియన్లు
- యూఎస్ కస్టమ్స్ ఆఫీసర్ల తనిఖీల్లో చిక్కి తంటాలు
న్యూఢిల్లీ: పూమా, అదిదాస్, నైకి వంటి పెద్ద పెద్ద బ్రాండ్ పేర్లతో ఉన్న నకిలీ వస్తువులతో అమెరికాకు వెళ్తున్నారా..? అయితే, వాటిని యూఎస్ కస్టమ్స్ ఆఫీసర్లు సీజ్ చేసి డస్ట్బిన్లో పడేస్తారు. ఎక్కువ మాట్లాడితే కేసు పెట్టి మరీ మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడతారు జాగ్రత్త..! అమెరికాలో గతేడాది19,724 షిప్మెంట్ల నుంచి 23 మిలియన్ల ఫేక్ బ్రాండ్ వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాంతో అమెరికా కస్టమ్స్ అధికారులు నకిలీ వస్తువుల స్మగ్లింగ్పై నిఘా పెంచారు. అందులో భాగంగా విమానాశ్రయాల్లో, సముద్రాల్లోని పోర్ట్ ఎంట్రీల్లో తనిఖీలు పెంచారు. అయితే, ఈ తనిఖీల్లో ఎక్కువగా పెద్ద పెద్ద బ్రాండ్ పేర్లతో తయారైన నకిలీ వస్తువులను వాడుతున్న భారతీయులే ఎక్కువగా పట్టుబడుతున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ వెల్లడించింది.
ఈ నివేదిక ప్రకారం..అమెరికాకు వెళ్లిన చాలా మంది భారతీయ విద్యార్థులు, ప్యాసింజర్లు నకిలీ లగ్జరీ వస్తువులను తీసుకెళ్లారు. అమెరికా కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో వారి దగ్గర ఎక్కువగా పూమా, అదిదాస్, నైకి వంటి పెద్ద పెద్ద బ్రాండ్ పేర్లతో ఉన్న నకిలీ డ్రెస్సులు, హ్యాండ్బ్యాగ్స్, బూట్లు, సాక్సులు, ఎలక్ట్రానిక్ వస్తువులు బయటపడ్డాయి. అవి అమ్మెందుకు కాదని..తాము వాడుకోవడానికి మాత్రమేనని ప్యాసింజర్లు ఎంత చెప్పిన అధికారులు వినిపించుకోలేదు. వాటిని సీజ్ చేసి డిస్ట్రాయ్ చేశారు. ఇదేంటని ప్రశ్నించిన ప్యాసింజర్లను.. కేసు రిజిస్టర్ చేసి, జైల్లో పెడతామని వార్నింగ్ ఇస్తున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ పేర్కొంది. అలాగే పలువురి బాధితుల గోడును కూడా వివరించింది.
చెక్లిస్ట్ను అందుబాటులో ఉంచాలి
కాలిఫోర్నియాలో మాస్టర్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ ఎకనామిక్స్ చదువుతున్న హైదరాబాద్కు చెందిన 27 ఏళ్ల యువకుడికి కూడా కొన్ని నెలల క్రితం ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆ స్టూడెంట్ కి చెందిన సుమారు 10 షర్టులు, ప్యాంట్లు, మూడు జతల షూలను కస్టమ్స్ అధికారులు చెత్తబుట్టలో పడేశారు."ఇండియాలో ప్రజలు పెద్ద బ్రాండ్ల నకిలీలు లేదా కాపీలను అమ్మడం, కొనడం చాలా సాధారణం. వాటిని అమెరికా తీసుకెళ్లడం తీవ్రమైన నేరమని నాకు తెలీదు. అమెరికాకు ఏది తీసుకెళ్లవచ్చు, ఏది తీసుకెళ్లవద్దు అనే విషయం ప్యాసింజర్లకు ఎలా తెలుస్తుంది. అధికారులే చెక్లిస్ట్ను అందుబాటులో ఉంచాలి కదా..?" అని యువకుడు ప్రశ్నించాడు. -
జార్ఖండ్లోని జంషెడ్పూర్కు చెందిన ఓ స్కూల్ టీచర్
రూ. 30వేల వస్తువులు పోగొట్టుకున్న
నా కొడుకు టెక్సాస్లో సప్లయ్ చైన్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చదువుతున్నాడు. వాడి కోసం రూ. 30 వేలు పెట్టి ఎనిమిది షర్ట్స్, నాలుగు ప్యాంట్లు, కొన్ని సాక్స్, ఒక జత షూలను కొన్నాను. వాటిని లగేజీలో ప్యాక్ చేసుకుని షిప్పులో యూఎస్ వెళ్లాను. అమెరికాలో దిగగానే పోర్ట్ ఎంట్రీ వద్ద అధికారులు నా బ్యాగ్లను తనిఖీ చేశారు. షర్ట్స్, ప్యాంట్లు, సాక్స్, షూలను బయటకు తీసి చూశారు. నువ్వు వీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి స్మగ్లింగ్ చేస్తున్నామని ప్రశ్నించారు. దాంతో నేను షాక్ అయ్యాను. అవి నా కొడుకు కోసం కొని తెచ్చాని వివరించడానికి ప్రయత్నించాను. అయినా, అవన్నీ నకిలీ వస్తువులని, పెద్ద బ్రాండ్ల కాపీలని చెప్పారు. వాటిని సీజ్ చేశారు.రూ. 30 వేల విలువైన నా వస్తువులను అధికారులు పట్టుకుపోయారు.
నకిలీ వస్తువులతో ప్రమాదం
టైమ్స్ ఆఫ్ ఇండియా యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు ఫేక్ బ్రాండ్ వస్తువులపై వివరణ కోరగా.."2023లో 19 వేల షిప్మెంట్ల నుంచి 23 మిలియన్ల నకిలీ వస్తువులు పట్టుబడ్డాయి. ఇది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (ఐపీఆర్) నిబంధనలకు విరుద్ధం. అందుకే తనిఖీలను, దర్యాప్తును పెంచాం. పట్టుబడిన వస్తువులు బ్రాండ్ వస్తువులు అయ్యివుంటే వాటి విలువ సుమారు 2.7 బిలియన్ డాలర్లు ఉండేది. నకిలీ వస్తువులతో అమెరికా జాతీయ భద్రతకు, ఆర్థిక వ్యవస్థకు చాలా నష్టం జరుగుతున్నది" అని అధికారులు పేర్కొన్నారు.