- నర్సులు డెలివరీ చేయడమే కారణమని బంధువుల ఆందోళన
జహీరాబాద్, వెలుగు : ఆక్సిజన్ అందక అప్పుడే పుట్టిన ఓ చిన్నారి చనిపోయింది. అయితే డాక్టర్లు అందుబాటులో లేకపోవడం, నర్సులు డెలివరీ చేయడం వల్లే చిన్నారి చనిపోయిందని బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఆదివారం జరిగింది. బాధిత బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... ఝరాసంగం మండలం పొట్పల్లి గ్రామానికి చెందిన మనోహరకు పురిటినొప్పులు రావడంతో ఆదివారం ఉదయం జహీరాబాద్ ఏరియా హాస్పిటల్ కు తీసుకొచ్చారు.
డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో నర్సులు నార్మల్ డెలివరీ చేశారు. తర్వాత శిశువుకు ఆక్సిజన్ అందడం లేదంటూ హాస్పిటల్ మొదటి అంతస్తుకు తీసుకెళ్లారు. అక్కడ ఎవరు లేకపోవడం, ఇదే టైంలో పసికందు పరిస్థితి మరింత విషమించడంతో అక్కడే చనిపోయింది. దీంతో డాక్టర్లు అందుబాటులో లేకపోవడం, నర్సుల నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి చనిపోయిందంటూ కుటుంబసభ్యులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. డాక్టర్లు లేనందునే.. వేరే హాస్పిటల్ కు తీసుకెళ్తామని చెప్పినా నర్సులు వినకుండా డెలివరీ చేశారని ఆరోపించారు.
విషయం తెలుసుకున్న బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు హాస్పిటల్ వద్దకు చేరుకొని సిబ్బందిని నిలదీశారు. సమాచారం అందుకున్న జహీరాబాద్ టౌన్ ఎస్సై లవకుమార్ తన సిబ్బందితో హాస్పిటల్ చేరుకొని నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ సైతం హాస్పిటల్ కు వచ్చి చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కలెక్టర్, వైద్యాధికారులకు ఫోన్ చేసి హాస్పిటల్ పరిస్థితిని వివరించారు. చిన్నారి మృతి విషయమై డ్యూటీ డాక్టర్ శిల్పను వివరణ కోరగా.. డెలివరీ తర్వాత పసికందుకు ఆక్సిజన్ అవసరం కావడంతో పైఅంతస్తుకు తరలించారని, ఆక్సిజన్ పెట్టేలోపే చిన్నారి చనిపోయిందని చెప్పారు.
