ఈ ఏడాది మార్చి 1 నుంచి అమల్లోకి యూఎస్ సీఐఎస్ ప్రకటన
న్యూయార్క్: అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులకు, ముఖ్యంగా భారతీయ టెకీలకు యూఎస్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. హెచ్-1బీ సహా పలు రకాల వీసాల ‘ప్రీమియం ప్రాసెసింగ్’ ఫీజులను పెంచుతున్నట్లు యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
హెచ్ 1 బీ వీసా ప్రీమియం ఫీజులు 2,805 డాలర్ల (రూ. 2,37,020) నుంచి 2,965 డాలర్ల కు (రూ.2,50,540) పెంచింది. అంటే భారత కరెన్సీలో రూ. 13,520 పెరిగింది. మార్చి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుంది. మిగతా వీసా కేటగిరీల ప్రాసెసింగ్ ఫీజుల్లోనూ మార్పులు చేసింది. 2023 జూన్ నుంచి 2025 జూన్ మధ్య ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ ఫీజు పెంచినట్లు యూఎస్సీఐసీ వెల్లడించింది. కాగా, వీసా అప్లికేషన్స్ను వేగంగా ప్రాసెస్ చేసేందుకు ఈ ఫీజులను వినియోగిస్తారు.
పెరిగిన ఫీజులు ఇలా..
హెచ్-1బీ, ఎల్-1, ఒ-1,పీ-1, టీఎన్ వీసాల (ఫారం ఐ-129) విషయంలో ప్రీమియం ఫీజు 2,805 డాలర్ల (రూ.2,37,020) నుంచి 2,965 డాలర్ల కు (రూ2,50,540) పెంచింది. ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ (ఐ-140) ఫీజును రూ. 2,37,020 నుంచి రూ. 2,50,540కు హైక్ చేసింది. ఎఫ్, జే, ఎంలాంటి వీసాల ప్రాసెస్ ఫీజును రూ.1,66,040 నుంచి రూ. 1,75,340 అంటే రూ. 9,300 పెంచింది.
ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్ (ఓపీటీ), స్టెమ్ ఓపీటీ (ఐ-765)వీసాల ప్రాసెసింగ్ ఫీజులను రూ. 1,42,380 నుంచి రూ.1,50,410లకు అంటే రూ.8,030 మేర హైక్ చేసింది. హెచ్2బీ, ఆర్-1 వీసాలపై ఫీజును రూ. 1,42,380 నుంచి రూ. 1,50,410 కు పెంచింది. ఉద్యోగ మార్పులు, వీసా పొడిగింపులు లేదా ప్రయాణ ప్రణాళికల కోసం అత్యవసరంగా వీసా కావాలనుకునే వారికి ఈ పెంపు భారంగా మారనున్నది. కాగా..అమెరికాలో హెచ్-1బీ, ఎల్-1 వీసాలను అత్యధికంగా పొందేది భారతీయులే. కాబట్టి ఈ ధరల పెంపు ప్రభావం మన నిపుణులు, విద్యార్థులపై నేరుగా పడనుంది.
