కేసీఆర్​ సర్కార్​ అవినీతితోనే మేడిగడ్డ కుంగింది: ఉత్తమ్

కేసీఆర్​ సర్కార్​ అవినీతితోనే మేడిగడ్డ కుంగింది: ఉత్తమ్

మాజీ మంత్రి హరీశ్​రావు పదే పదే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​రెడ్డి మండిపడ్డారు. కమీషన్లకు కక్కుర్తి పడి నీటి వాటాల్లో రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. కృష్ణా బోర్డుకు తాము ప్రాజెక్టులను అప్పగించలేదని, బీఆర్ఎస్ ​మాత్రం తమపై విష ప్రచారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్​ షెకావత్​ను కలిసినప్పుడు కూడా ప్రాజెక్టులను అప్పగించేది లేదని ఖరాకండిగా చెప్పామని తెలిపారు. సోమవారం సాయంత్రం సెక్రటేరియెట్​లో మీడియాతో ఉత్తమ్​ మాట్లాడారు. కృష్ణా రివర్ మేనేజ్​మెంట్​ బోర్డుకు ప్రాజెక్టులు ఇవ్వడానికి 56 రోజుల తమ పాలనలో ఎప్పుడూ ఒప్పుకోలేదన్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.95 వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టినా ఒక్క ఎకరానికి కూడా నాటి బీఆర్​ఎస్​ సర్కార్​ నీళ్లు ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్​ అన్నారు. ‘‘మూడేండ్లకే  మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయే పరిస్థితి తలెత్తింది. దీనికి కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతే కారణం. నిజాలేంటో తేల్చడానికి విజిలెన్స్​తో విచారణ చేయిస్తున్నం” అని చెప్పారు. ఉమ్మడి మహబూబ్​నగర్​జిల్లాకు నీళ్లు ఇచ్చే ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్​ప్రాజెక్టును పదేండ్లు నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్, హరీశ్ రావు యువతను, ప్రజలను రెచ్చగొట్టారు.. బ్లాక్​మెయిల్​ చేశారు. హరీశ్​రావు పెట్రోల్​ పోసుకున్నట్లు నమ్మించి.. వేరే వాళ్ల మరణాలకు కారణం అయ్యిండు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఘనత కేసీఆర్​ది, బీఆర్ఎస్​ది ఎంతమాత్రం కాదు. యూపీఏ భాగస్వామ్య పక్షాలు సహా ప్రతిపక్షపార్టీల మద్దతును కాంగ్రెస్​ కూడగట్టడంతోనే తెలంగాణ వచ్చింది” అని అన్నారు. కేసీఆర్​పాలనలో అస్తవ్యస్థమైన ఇరిగేషన్​ వ్యవస్థను చక్కదిద్దుతున్నామని మంత్రి ఉత్తమ్​ తెలిపారు. కృష్ణా బోర్డుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టులు అప్పగించబోమని స్పష్టం చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే కుంభం అనిల్​ కుమార్​రెడ్డి పాల్గొన్నారు.

Also Read : మేడారం జాతరపై మావోయిస్టుల లేఖ కలకలం