- కమిటీపై కేసు తేలేదాకా కొత్త లాయర్ల ఎన్రోల్మెంట్ వద్దన్న హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ బార్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన తాత్కాలిక నమోదు కమిటీ ద్వారా కొత్త లాయర్ల ఎన్రోల్మెంట్ ప్రక్రియకు హైకోర్టు బ్రేక్ వేసింది. కమిటీ ఏర్పాటుపై దాఖలైన కేసులో తీర్పు వచ్చే వరకు ఎన్రోల్మెంట్ ప్రక్రియను కొనసాగించొద్దని జస్టిస్ ఎన్. తుకారాంజీ ఆదేశించారు. దీంతో ఆగస్టు 17న చేపట్టాల్సిన దాదాపు 200 మంది దరఖాస్తుల పరిశీలన కూడా వాయిదా పడనుంది. అడ్వకేట్స్ యాక్ట్-1961లోని సెక్షన్ 58కు విరుద్ధంగా తాత్కాలిక ఎన్రోల్మెంట్ కమిటీని ఏర్పాటు చేశారని బి. జగదీశ్వర్ హైకోర్టును ఆశ్రయించారు.
కమిటీ ఏర్పాటు కోసం 2026 జూన్ 6న ఇచ్చిన లేఖను రద్దు చేసి, చట్టం ప్రకారం ఎన్రోల్మెంట్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ పిటిషన్పై ఇప్పటికే విచారణ పూర్తయి తీర్పు కోసం పెండింగ్లో ఉందని కోర్టు గుర్తు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో తాత్కాలిక కమిటీ ద్వారా ఎన్రోల్మెంట్ చేస్తే.. తర్వాత పిటిషనర్ వాదనలు నెగ్గితే ఆ నమోదుల చెల్లుబాటుపై కూడా సమస్యలు వస్తాయని పేర్కొంది. దీంతో తుది తీర్పు వచ్చే వరకు ఎన్రోల్మెంట్ ప్రక్రియను ఆపేయాలని కమిటీని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 31కి వాయిదా వేసింది.
