కాబోయే ప్రధాని రాహులే

కాబోయే ప్రధాని రాహులే

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుస్తుందని దేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీయేనని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, ఆ పార్టీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి ఉత్తమ్ కుమార్​రెడ్డి అన్నారు.ఆదివారం మిర్యాలగూడలోని జేఎస్​ఆర్​ ఫంక్షన్ హాల్ లో, వేములపల్లి, దామరచర్ల మండలాల పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014 ఎన్నికల సమయంలో బీజేపీ విదేశాల్లో అక్రమంగా పోగేసిన నల్లధనం తెప్పించి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు జమచేస్తామని, లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసి నెరవేర్చలేదన్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యలు రెట్టింపయ్యాయన్నారు. మతతత్వాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిని పొందాలనుకుంటున్న మొదటి ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. బీజేపీకిఓటు వేస్తే టీఆర్ఎస్‌కు వేసినట్లే అన్నారు. డీమానిటైజేషన్, జీఎస్టీ అమలు విషయంలో బీజేపీకి టీఆర్‌ఎస్ సపోర్ట్ చేసిందన్నారు. బీజేపీని విమర్శిస్తూ సీఎంకేసీఆర్ ఆడుతున్న కొత్త డ్రామా హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసీఆర్ ఈ ఐదేళ్లలో ఖాజీపేట రైల్వే స్టేషన్, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వ విద్యాలయం ఎందుకు సాధించలేదో ప్రజలకు చెప్పాలన్నారు. 16మంది ఎంపీలను గెలిపిస్తే దేశ రాజకీయాలను శాసిస్తామంటున్న కేసీఆర్ ఇప్పటి వరకు కేంద్రం నుంచి నిధులు ఎందుకు రాబట్టలేక పోయరో చెప్పాలన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వరి మద్దతు ధర క్వింటాల్ కు రూ. 2500కు పెంచుతామన్నారు. అనంతరం మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి మాట్లాడారు. కేసీఆర్​ ఎన్నికలహామీలను అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదు ..డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టలే దన్నారు. గత లోక్ సభఎన్నికల్లో ఈ స్థానంలో కాంగ్రెస్‌కు ఇచ్చిన మెజార్టీకిమించి ఈ ఎన్నికల్లో అందించాలని కోరారు. పార్టీకి నష్టమని తెలిసినా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియాగాంధీకి ఈ ఎన్నికల్లో ఉత్తమ్ ను గెలిపించి కానుక ఇవ్వాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్​, డీసీసీ అధ్యక్షుడు శంకర్​ నాయక్ ,సాముల శివారెడ్డి తదితరులున్నారు.