ఐదుగురు సీనియర్ అధికారులపై యోగి సర్కార్ వేటు

ఐదుగురు సీనియర్ అధికారులపై యోగి సర్కార్ వేటు

లక్నో : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఐదుగురు సీనియర్ అధికారులను సస్పెండ్ చేసింది. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ) బదిలీల్లో తీవ్ర అవకతవకలు కారణమయ్యారంటూ ఐదుగురు అధికారులపై వేటు వేసింది. చీఫ్ ఇంజనీర్, పీడబ్ల్యూడీ హెడ్ మనోజ్ కుమార్ గుప్తా, చీఫ్ ఇంజనీర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) రాకేష్ కుమార్ సక్సేనా, సీనియర్ స్టాఫ్ ఆఫీసర్ శైలేంద్ర కుమార్ యాదవ్‌, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పంకజ్ దీక్షిత్, ప్రిన్సిపల్ అసిస్టెంట్ సంజయ్ కుమార్ చౌరాసియాను ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ సస్పెండ్ చేశారు. 

జులై 18వ తేదీన పీడబ్ల్యూడీ మంత్రి జితిన్ ప్రసాద్ ఓఎస్డీ అనిల్ కుమార్ పాండేపై చర్య తీసుకున్న తర్వాత ఈ ఐదుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. జులై 16న సమర్పించిన విచారణ నివేదిక ఆధారంగా ఐదుగురు ఇంజనీర్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకుని తక్షణమే సస్పెండ్ చేశారు. పీడబ్ల్యూడీ బదిలీలలోచోటు చేసుకున్న అవకతవకలపై విచారించేందుకు వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ మనోజ్ కుమార్ సింగ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి విచారణ కమిటీని ముఖ్యమంత్రి యోగి ఏర్పాటు చేశారు.