
జనగామ అర్బన్, వెలుగు: వనమహోత్సవ లక్ష్యాలను అధిగమించాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ప్రభుత్వం నిర్దేశించిన 30.50 లక్షల మొక్కలు నాటడం, జలశక్తి అభియాన్, సీజనల్ వ్యాధులు తదితర అంశాలపై అడిషనల్ కలెక్టర్ పింకేశ్కుమార్ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అటవీ శాఖలో, మున్సిపాలిటీలో మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా నాటించాలని సూచించారు. రహదారుల వెంట అవెన్యూ ప్లాంటేషన్చేపట్టాలన్నారు.
జాతీయ కుటుంబ లబ్ధి పథకంపై గ్రామసభల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. జలశక్తి అభియాన్ లక్ష్యాలను సాధించాలని, దోమలు ఎక్కువగా ఉన్న మురికి వాడల్లో ఫాగింగ్ చేయించాలని పేర్కొన్నారు. జడ్పీ సీఈవో మాధురీ షా, డీఆర్డీఏ పీడీ వసంత, డీపీవో స్వరూప, డీఎంహెచ్వో మల్లిఖార్జున్రావు, డీఏవో రామారావు నాయక్, బీసీడీవో రవీందర్, ఎక్సైజ్ శాఖ అధికారి అనిత తదితరులు పాల్గొన్నారు.