నల్గొండ, వెలుగు : వాసవి మాత జయంతి ఉత్సవాలను పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని రామకోటి స్థూప దేవాలయం, గాంధీ పార్క్లలో నిర్వహించిన ఉత్సవాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాసవి మాత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం విశేషమన్నారు.
బాసర, కాలేశ్వరం దేవాలయాలు, గోదావరి పుష్కరాల అభివృద్ధికి ప్రభుత్వం రూ. 500 కోట్లు కేటాయించిందని, అలాగే నల్గొండలోని రామాలయం, ఆంజనేయస్వామి ఆలయం, బ్రహ్మంగారి గుట్ట శివాలయ అభివృద్ధి పనులను రూ. 100 కోట్లతో రెండు నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు. రామకోటి దేవాలయానికి గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చామని, గాంధీ పార్క్ భవన పునర్నిర్మాణానికి సహకరిస్తామని, డీఎంహెచ్ఓ కార్యాలయం మారిన వెంటనే రహదారి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. భక్తి, సేవ, అభివృద్ధి అనే లక్ష్యాలతో ప్రజలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
సూర్యాపేట : సూర్యాపేట సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధ్యక్షతన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలను ఆదివారం అధికారికంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి మాట్లాడుతూ వాసవి మాత చేసిన ప్రాణత్యాగాన్ని గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వం ఈ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు.
ప్రభుత్వం ఆర్యవైశ్యులకు పెద్దపీట వేస్తూ ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేసిందని, మున్సిపల్ చైర్పర్సన్గా ఆ వర్గానికి చెందిన మహిళకు అవకాశం కల్పించి సముచిత స్థానం ఇచ్చిందని గుర్తుచేశారు.
జడ్చర్ల టౌన్ : వాసవి కన్యకాపరమేశ్వరి దేవి అమ్మవారి జయంతిని స్టేట్ ఫంక్షన్ గా అధికారికంగా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆదివారం జడ్చర్ల లోని మున్సిపల్, తహహసీల్దార్ కార్యాలయాలలో, ప్రభుత్వ ఆస్పత్రిలో వాసవి మాత ఫొటోకు పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక, జిల్లా ఆర్యవైశ్య సంఘాల నేతలు జిల్లా అధ్యక్షుడు పాలాది రామ్మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి మేడిశెట్టి రామకృష్ణ, మున్సిపల్ చైర్ పర్సన్ కోనేటి పుష్పలత, వైస్ చైర్పర్సన్ సారిక రామ్మోహన్ సత్యనారాయణ ఉన్నారు.

