- సుమారు 2.5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా
- అన్ని ఏర్పాట్లు చేసిన ఆఫీసర్లు
- భక్తుల కోసం రెండు లక్షల లడ్డూలు తయారీ
వేములవాడ, వెలుగు : సిరిసిల్ల జిల్లా ఎములాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం శివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. వేములవాడ అనుబంధమైన భీమేశ్వర స్వామి ఆలయంలో శనివారం నుంచి వేడుకలు ప్రారంభం కానున్నాయి. వేడుకల్లో భాగంగా 14, 15, 16 తేదీల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉత్సవాల సందర్భంగా రాజన్న, భీమన్న ఆలయాలను రంగురంగుల విద్యుద్దీపాలతో ముస్తాబు చేశారు. పట్టణం నలువైపులా స్వాగత తోరణాలు, భక్తులు రాజన్న సన్నిధికి చేరుకునేందుకు వీలుగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు వీధుల్లో చలువపందిళ్లు వేశారు. ఏర్పాట్లను ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బి.గీతే, ఆలయ ఈవో రమాదేవిఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
2.5 లక్షల మంది వస్తారని అంచనా
ఆదివారం జరిగే మహాశివరాత్రి జాతరకు సుమారు 2.5 లక్షల మంది భక్తులు వస్తారని ఆఫీసర్లు అంచనా వేశారు. అందుకు తగ్గట్లుగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. భక్తుల స్నానాల కోసం ప్రత్యేకంగా దేవస్థాన పార్కింగ్ వద్ద పురుషుల కోసం 120, మహిళల కోసం 140 వాటర్ షవర్స్ ఏర్పాటు చేశారు.
భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు ప్రధానంగా వసతి గదులు, తాగునీటి విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించారు. భక్తుల కోసం ఇప్పటికే రెండు లక్షల లడ్డూలను సిద్ధం చేసినట్లు ఆలయ ఆఫీసర్లు తెలిపారు. వేములవాడకు వచ్చే అన్ని మార్గాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అత్యవసర సెంటర్లను సైతం సిద్ధం చేశారు.
ప్రత్యేక క్యూఆర్ కోడ్
వేములవాడకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు దేవస్థాన వివరాలు తెలుసుకునేలా ప్రత్యేక వాట్సప్ నంబర్, క్యూఆర్ కోడ్ను ఈవో రమాదేవి ప్రారంభించారు. పోస్టర్లో ఇచ్చిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా లేదా 87369 36969 నంబర్కు వాట్సప్లో హాయ్ అని మెసేజ్ చేసినా దేవస్థానం వివరాలు కనిపించనున్నాయి.
ఇందులో దర్శనం, సేవల సమయాలు, దర్శన టికెట్ కౌంటర్లు, ప్రసాదం కౌంటర్, అన్న ప్రసాదం, రవాణా సదుపాయాలు, హాస్పిటల్, దివ్యాంగుల సౌకర్యాలు, తాగునీరు, మరుగుదొడ్లు, కల్యాణకట్ట, సమాచార కేంద్రం, పోలీస్ స్టేషన్ వంటి 12 రకాల సేవలు అందుబాటులోకి వస్తాయని ఆఫీసర్లు వెల్లడించారు.
600 స్పెషల్ బస్సులు
వేములవాడలో జరిగే మహాశివరాత్రి జాతర ఉత్సవాల కోసం వివిధ ప్రాంతాల నుంచి 600 బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ బోనాల శ్రీనివాస్ తెలిపారు. వరంగల్తో పాటు కోరుట్ల, మెట్పల్లి, ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, కరీంనగర్, నర్సంపేట, హనుమకొండ, హైదరాబాద్, సిరిసిల్ల, హుజూరాబాద్ నుంచి బస్సులు నడుస్తాయని ప్రకటించారు. అలాగే వేములవాడ బస్టాండ్ నుంచి ఆలయం వరకు మూడు రోజులు 24 గంటల పాటు ఉచిత బస్సులను నడిపిస్తాయని చెప్పారు.
ప్రతి భక్తుడికి దర్శనం కల్పిస్తాం
వేములవాడలో జరిగే మహాశివరాత్రి జాతర కోసం వచ్చే ప్రతి భక్తుడికి స్వామి దర్శనం కల్పిస్తాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పూర్తి సమాచారం తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్ను రిలీజ్ చేశాం. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు హెల్త్ పరంగా ఇబ్బందులు తలెత్తకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అత్యవసర కేంద్రాలు, హెల్ప్ డెస్క్లను సిద్ధం చేశాం.
– రమాదేవి, ఈవో, వేములవాడ-
