
శంషాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అతి పురాతన ఆలయం వెండికొండ సిద్ధేశ్వర స్వామి 68వ జాతర ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెండికొండ సిద్ధేశ్వర స్వామి శోభాయాత్రలో బీజేపీ సీనియర్ నేత సంగప్ప పాల్గొని అమృత స్నానాలు నిర్వహించారు. అనంతరం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మైలార్ దేవ్ పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి స్వామిని దర్శించుకోగా.. ఆలయ అర్చకులు ఆశీస్సులు, తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, నిత్య అన్నదానంతో పాటు ప్రసాదాలు, నీరు అందిస్తున్నామని ఆలయ చైర్మన్, ఈవో, జాతర కమిటీ సభ్యులు తెలిపారు. ప్రథమ చికిత్స అందించేందుకు శంషాబాద్ లిమ్స్ హాస్పిటల్, ఈశా హాస్పిటల్ సన్ రైజ్ ఆస్పత్రి క్యాంపులు ఏర్పాటు చేసి ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారంతో ఉత్సవాలు ముగియనున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.