జూబ్లీహిల్స్, వెలుగు: భూసార పరిరక్షణపై రైతులను చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో ఐకార్–ఐఏఆర్ఐ వీసీ డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావుకు ప్రతిష్టాత్మక ఎం.ఎస్.స్వామినాథన్ అవార్డును ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, రసాయనాల అధిక వినియోగం వల్ల భూసారం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్రంలో చెరువులు, కుంటలను కాపాడేందుకు హైడ్రా పనిచేస్తున్నప్పటికీ కొందరు దానిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, నూజివీడు సీడ్స్ లిమిటెడ్ సీఎండీ మండవ ప్రభాకరరావు పాల్గొన్నారు.

