ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ ఉద్యమ నాయకుడు, రాజకీయ నేత గొట్టిముక్కల పద్మారావు కన్నుమూశారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని తన నివాసంలో ఆదివారం(జూన్ 21) తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. పద్మారావు మృతితో రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తెలంగాణ ఉద్యమంలో గొట్టిముక్కల పద్మారావు కీలక పాత్ర పోషించారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. పద్మారావు పార్థివదేహానికి నివాళులర్పించేందుకు నేతలు తరలివస్తున్నారు.
గొట్టిముక్కల రాజకీయ ప్రస్థానం..
సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ పద్మారావు చురుకైన పాత్ర పోషించారు. 1970 ల్లో తెలంగాణ తొలి ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. మలి దశ ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. 1996లో టీడీపీ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు గొట్టిముక్కల. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్లో చేరారు. 2014లో కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో కాంగ్రెస్లో చేరారు.
