గుల్జార్​హౌజ్ ​ప్రమాదంపై న్యాయ విచారణ జరపాలి : బాధిత కుటుంబీకులు

గుల్జార్​హౌజ్ ​ప్రమాదంపై న్యాయ విచారణ జరపాలి : బాధిత కుటుంబీకులు
  • అధికారుల నిర్లక్ష్యం వల్లే కుటుంబ సభ్యుల్ని కోల్పోయాం 
  • మీడియా సమావేశంలో బాధిత కుటుంబీకులు

హైదరాబాద్​ సిటీ, వెలుగు: గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంపై న్యాయ విచారణ జరపాలని బాధిత కుటుంబీకులు డిమాండ్​ చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో వారు మీడియాతో మాట్లాడారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే  తమ కుటుంబ సభ్యుల్ని కోల్పోయామని ఆరోపించారు. అగ్నిమాపక శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడటం తమను తీవ్రంగా కలిచివేసిందన్నారు.

అగ్నిప్రమాదం జరిగిన గంట వరకు ఫైర్ ఇంజిన్లు రాలేదని తెలిపారు. గోడలను పగలకొట్టేందుకు ఫైర్ సిబ్బంది వద్ద పరికరాలు కూడా లేవని చెప్పారు. మంటలు ఆర్పి లోపలికి వెళ్లి ఉంటే తమ కుటుంబ సభ్యుల ప్రాణాలు దక్కేవని అన్నారు. ఘటనాస్థలానికి వచ్చిన పోలీస్ కానిస్టేబుల్ ఏం చేయకుండా ఉండిపోయారని తెలిపారు.

గాయపడ్డ వారిని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లగా..  డాక్టర్ల నిర్లక్ష్యంతో ముగ్గురు చనిపోయారని ఆరోపించారు. పోలీస్ కేసు నమోదు కాకుంటే తాము వైద్యం చేయమని డాక్టర్లు నిరాకరించినట్టు వెల్లడించారు. ఉస్మానియా డాక్టర్లు ట్రీట్​మెంట్​కు నిరాకరించడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లామని తెలిపారు. మీడియా సమావేశంలో సంతోష్ గుప్తా, గోషామహల్ నివాసి శ్రీనివాస్, అడ్వకేట్ అతుల్ అగర్వాల్ పాల్గొన్నారు. 

3 నిమిషాల్లోనే స్పాట్​కు చేరుకున్నాం:  ఫైర్​ సేఫ్టీ అధికారులు

గుల్జార్​ హౌజ్​ఘటనపై బాధిత కుటుంబీకులు చేసిన ఆరోపణలపై ఫైర్​సేఫ్టీ అధికారులు స్పందించారు. ఫైర్​ఇంజన్​లో నీళ్లు, పరికరాలు లేవన్న ఆరోపణలను ఖండించారు. ఘటనా స్థలానికి మొదటి ఫైర్​ఇంజిన్​3 నిమిషాల్లో వచ్చిందన్నారు. ఫైర్​ఇంజిన్ 4,500 లీటర్ల కెపాసిటీతో ఉందని, అది పూర్తిగా నిండి ఉందన్నారు.

డ్రాగన్​లైట్స్, బ్రీథింగ్​ఎక్విప్​మెంట్​తదితర పూర్తి పరికరాలతో సిబ్బంది రెస్య్కూలో పాల్గొన్నారని తెలిపారు. ఘటనా స్థలానికి వెళ్లే సరికే దట్టమైన పొగ, మంటలు వ్యాపించాయన్నారు. తీవ్రతను తగ్గించేందుకు సిబ్బంది శ్రమించి, వీలైనంత త్వరగా లోపలికి వెళ్లారని, ల్యాడర్​ల సాయంతోనే బిల్డింగ్​పైకి ఎక్కి సెర్చ్​, రెస్క్యూ ఆపరేషన్​ నిర్వహించారని  వివరించారు.