వీడియో: స్టేజ్ పై రెజ్లర్ ను కొట్టిన ఎంపీ

వీడియో: స్టేజ్ పై రెజ్లర్ ను కొట్టిన ఎంపీ

స్టేజ్ పైనే రెజ్లర్ చెంప చెల్లుమనిపించాడు ఓ ఎంపీ. జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన జాతీయ ఛాంపియన్‌షిప్ ఈవెంట్‌లో ఈ ఘటన జరిగింది. బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్..ఉత్తరప్రదేశ్ లోని కైసర్ గంజ్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాంచీలోని షహీద్ గణపత్ రాయ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన అండర్-15 జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ ఈవెంట్‌ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీ స్టేజ్ పై ఉండగా ఓ రెజ్లర్ వచ్చి తనకు  పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం ఇప్పించాలని కోరాడు. అతనికి వయసు పరిమితి దాటడంతో అతనిని ఆడనివ్వలేదు. అయితే తనకు ఆడేందుకు అవకాశం ఇప్పించాలని స్టేజ్ పైకి ఎక్కి ఎంపీనీ పదే పదే విజ్ఞప్తి చేశాడు. దీంతో సహనం కోల్పోయిన ఎంపీ ఆ రెజ్లర్ చెంపపై కొట్టాడు. రెండు సార్లు చెంప చెల్లుమనిపించాడు. వెంటనే అక్కడున్న వారు ఎంపీని అడ్డుకుని.. రెజ్లర్ ను అక్కడి నుంచి బయటకు పంపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వస్తున్నాయి.