అల్లరి మూక బీభత్సం: సైడ్ ఇవ్వలేదని బస్సు డ్రైవర్ ను చితకబాదారు

అల్లరి మూక బీభత్సం: సైడ్ ఇవ్వలేదని బస్సు డ్రైవర్ ను చితకబాదారు

విజయవాడ : విజయవాడ భవానీపురం దగ్గర అర్ధరాత్రి 50 మంది పోకిరీలు హంగామా సృష్టించారు. తమ టూవీలర్లకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ సైడ్ ఇవ్వడం లేదని ఆగ్రహించిన యువకులు బస్సును అడ్డుకుని డ్రైవర్ ను చితకబాదారు. నార్కెట్ పల్లి డిపోకు చెందిన TSRTC బస్సు హైదరాబాద్ వస్తుండగా… ఈ ఘటన జరిగింది.

10 టూవీలర్లపై వచ్చిన పోకిరీలు… బస్సును గొల్లపూడి సెంటర్ దగ్గర అడ్డుకుని, అద్దాలు ధ్వంసం చేశారు. డ్రైవర్ ను కొట్టిన తర్వాత అతడి వద్ద ఉన్న 25 వేల నగదు, టిమ్ మిషన్ ను ఎత్తుకెళ్లారు. యువకులు బస్సులోకి చొరబడి డ్రైవర్ ను కొడుతుంటే.. ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. డ్రైవర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దాడి చేసిన యువకుల్లో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు.