హైదరాబాద్, వెలుగు: చండూరు పబ్లిక్ మీటింగ్లో సీఎం కేసీఆర్ మాట్లాడినవన్నీ అబద్ధాలేనని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి మండిపడ్డారు. మోటార్లకు మీటర్లంటూ ప్రతిరోజూ అబద్ధం చెబుతున్నారంటూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. “ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. మీరు కుట్ర చేసి నడిపించబట్టే... ఆ నలుగురు ఎమ్మెల్యేలను బయటకు వదిలే ధైర్యం లేక కోడి పిల్లలను బుట్టల పెట్టినట్లు ప్రగతిభవన్ల దాచిపెట్టి ప్రజలను మోసం చేస్తున్నరు.
ఆ నలుగురు ఎమ్మెల్యేలలో ఒకరు సంఘటన జరిగిన నాడే.. మేమంతా కేసీఆర్ చెప్పినట్టే చేసినమని ప్రెస్ ముందు చెప్పింది నిజం కాదా? నిజాయితీపరులు అని మీరే చెబుతున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలనూ 4 రోజుల నుంచి నిర్బంధించాల్సిన అగత్యం ఏంటి? వారు నిజం బయట పెడతారనేనా ? బైపోల్ లోపు వారు ప్రగతిభవన్ కట్టడి నుంచి బయటకు రాగలిగే అవకాశం మీ నియంతృత్వ పాలనలో ఉందా లేదా ’’ అని విజయశాంతి ప్రశ్నించారు.