హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతున్నదని పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి అన్నారు. అందులో భాగంగానే ఇతర పార్టీల్లోని విజయశాంతి లాంటి వారు కాంగ్రెస్లోకి వస్తున్నారని అన్నారు. శనివారం ఆయన కంటోన్మెంట్ అభ్యర్థి వెన్నెలతో కలిసి గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. గద్దర్ కూతురు వెన్నెలను కంటోన్మెంట్ నుంచి గెలిపించేందుకు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 85 నుంచి 95 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పారు. ఆరు గ్యారెంటీలే కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొస్తాయని తెలిపారు. డిసెంబర్ 3 తర్వాత మూడు రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని చెప్పారు. డిసెంబర్ 9న ఫస్ట్ కేబినెట్ మీటింగ్ కూడా ఉంటుందన్నారు.