
విజయవాడ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయవాడ సెంట్రల్ ఏసీపీ నాగరాజారెడ్డిపై డీజీపీ గౌతమ్ సవాంగ్ సస్పెన్షన్ వేటు వేశారు. పటమటలోని సచ్చిదానంద ఆశ్రమ వీధిలో ఓ భవన యజమానిని ఏసీపీ బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితుల నుండి ఫిర్యాదులు రావడంతో డీజీపీ వెంటనే స్పందించి విచారణకు ఆదేశించారు. విజయవాడ పోలీసు కమిషనర్ జరిపిన ప్రాథమిక విచారణలో ఏసీపీపై ఆరోపణలు నిజమేనని తేలింది. బాధితులను ఉద్దేశ పూర్వకంగా వేధించినట్లు గుర్తించారు. పలు ఆధారాలు కూడా లభించాయి. విచారణాధికారుల నివేదిక మేరకు ఏసీపీ నాగరాజారెడ్డిపై ఆరోపణలు నిర్ధారించుకునన్న డీజీపీ వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు. సొంత శాఖ వారిపై ఏ మాత్రం ఆలస్యం లేకుండా డీజీపీ తీసుకున్న చర్య పోలీసు శాఖలో సంచలనం సృష్టిస్తోంది.