
ఇంగ్లాండ్ అండర్ 19 క్రికెట్ టీం విజయవాడ అమ్మవారిని దర్శించుకున్నారు. బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) ఆధ్వర్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) పర్యవేక్షణలో నవంబర్ 27 వరకు అంతర్జాతీయ క్వాడ్రాంగ్యులర్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు విజయవాడకు చేరుకున్న అండర్ 19 ఇంగ్లండ్ క్రికెట్ బృదంలోని 19 మంది సభ్యులు ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంగ్లండ్ క్రీడాకారులకు ఆలయ పాలకమండలి, ఆలయాధికారులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరిని వేద పండితులు ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టుబోర్డ్ సభ్యులు బుద్ధా రాంబాబు, కట్టా సత్తయ్య, కేసరి నాగమణి, సహాయ కార్యనిర్వాహణాధికారి చంద్రశేఖర్ గారు పాల్గొన్నారు.