వికారాబాద్: వికారాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం నుంచి ఏ పెట్రోల్ బంక్లోనూ పెట్రోల్ దొరకలేదు. అంతటా నో స్టాక్ బోర్డులు దర్శనం ఇచ్చాయి. ఒక వైపు అధికారులు ఎలాంటి కొరత లేదంటున్నా.. జిల్లా కేంద్రంలోనే పెట్రోల్ లేకపోవడం చర్చనీయాంశమైంది.
అయితే, జిల్లాలో ఇంధన కొరత ఉందంటూ సాగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని ఎస్పీ స్నేహ మెహ్రా స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మి ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరవద్దని సూచించారు.
ఇలాంటి చర్యల వల్ల అనవసరమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తడమే కాకుండా శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్నారు. పెట్రోల్, డీజిల్ కొరతపై ఎవరైనా అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
