తూరుబాక పర్ణశాల మధ్య రోడ్డుకు రిపేర్లు చేయాలి.. గ్రామస్తుల డిమాండ్

తూరుబాక పర్ణశాల మధ్య రోడ్డుకు రిపేర్లు చేయాలి.. గ్రామస్తుల డిమాండ్

భద్రాచలం, వెలుగు : తూరుబాక–-పర్ణశాల మధ్య రహదారికి రిపేర్లు చేయించాలని మండలంలోని పలు గ్రామాల ప్రజలు డిమాండ్​చేశారు. దుమ్ముగూడెం మండలం తూరుబాక–-పర్ణశాల గ్రామాల మధ్య ఆర్​అండ్​బీ రహదారి ఇసుక లారీల వల్ల ధ్వంసమై ప్రమాదాలకు కారణం అవుతోందని, తక్షణమే ఈ రోడ్డుకు రిపేర్లు చేయించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ములకపాడు క్రాస్​రోడ్డుపై ప్రజలు భారీ ఎత్తున ధర్నా, రాస్తారోకో చేపట్టారు. సుమారు 5 గంటలపాటు గ్రామస్తులు ఆందోళన చేపట్టడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్​అయ్యింది.

ఇటీవల ఈ రహదారిపై మృతి చెందిన వారి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు. ఆందోళనకారులతో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఫోన్​లో మాట్లాడినా ససేమిరా అన్నారు. అనంతరం తహసీల్దార్ అశోక్​కుమార్​ఘటనాస్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇసుక లారీలను నిలిపివేయాలని, రహదారి రిపేర్లు తక్షణమే చేయించాలని వారు డిమాండ్​చేశారు. ప్యాచ్ వర్కులు చేపిస్తామని, లారీల టైమింగ్స్ మార్చుతామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.