ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దని గ్రామస్తుల నిరసన

ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దని గ్రామస్తుల నిరసన
  •     పోలీస్ పహారాలో భూమి పూజ
  •     నరసింహులపల్లిలో ఉద్రిక్తత

బెజ్జంకి, వెలుగు : సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని నరసింహులపల్లి శివారులో శుక్రవారం ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ గ్రామస్తులు నిరసన తెలిపారు. భూమిపూజ జరుగుతుందని తెలుసుకున్న గ్రామస్తులు అక్కడకు వెళ్లి ‘ఫ్యాక్టరీ వద్దు గ్రామమే ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, అక్కడున్న మహిళలు వినకుండా గొడవకు దిగారు. పచ్చని పొలాల్లో చిచ్చుపెట్టే ఈ ఫ్యాక్టరీ తమ ఊర్లో వద్దంటూ ఆందోళన చేశారు.

కంపెనీ డైరెక్టర్ నరేశ్ కుమార్ గ్రామస్తులతో మాట్లాడుతూ.. ఈ ఫ్యాక్టరీ వల్ల ఎలాంటి హాని జరగదని, ఉపాధి అవకాశాలు అధికంగా ఉంటాయని చెప్పారు. సందేహాలు నివృత్తి చేసేందుకు ఇలాంటి ఫ్యాక్టరీ వద్దకు తీసుకువెళ్లి చూపిస్తామన్నారు. తర్వాతనే ఫ్యాక్టరీ నిర్మాణం చేపడుతామని హామీ ఇచ్చారు. అయితే అప్పటివరకు పనులు చేపట్టకూడదని గ్రామస్తులు కోరారు. కంపెనీ ప్రతినిధులు రామకృష్ణ, సీవీ రావు, విశ్వనాథం ఉన్నారు.