నీటి సమస్య పరిష్కరించాలని ఆందోళన

నీటి సమస్య పరిష్కరించాలని ఆందోళన

కుభీర్, వెలుగు: పక్కనే గడ్డెన్న ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఉన్నా.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కుభీర్​ మండలం నిగ్వ గ్రామంలో తీవ్ర నీటి కొరత ఏర్పడి గ్రామస్తులకు తిప్పలు తప్పడం లేదు. దీంతో సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహిళలు శనివారం గ్రామ పంచాయతీని ముట్టడించారు. జీపీ ఆఫీస్​ ముందు ఖాళీ బిందెలతో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 

గ్రామంలో బోరు మోటార్లు పనిచేయడం లేదని, మిషన్ భగీరథ నీళ్లు సైతం రావడం లేదని వాపోయారు. సమస్య పరిష్కరించాలని పంచాయతీ సెక్రటరీకి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదన్నారు. దాదాపు రెండు గంటల పాటు ఆందోళన చేశారు. అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.