
సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మరో ఓటమి ఎదురైంది. 8 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి జరిమానా పడింది. దూకుడుగా ఆడిన చెన్నై ఆటగాడు శివమ్ దూబే ఔటయ్యాక విరాట్ కోహ్లీ చేసిన సంబరాలు శృతిమించడంతో జరిమానా పడింది. తన మ్యాచ్ ఫీజ్లో 10 శాతం జరిమానా పడింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.2 కింద లెవెల్ 1 నేరానికి పాల్పడటంతో కోహ్లీకి జరిమానా విధించాల్సి వచ్చింది అని ఐపీఎల్ సలహా కమిటీ పేర్కొంది. లెవల్ 1 ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే మ్యాచ్ రిఫరీ నిర్ణయమే అంతిమమైనది.
బెంగళూరు, చెన్నై జట్ల మధ్య ఏప్రిల్ 18న జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ధోని సేన 6 వికెట్ల నష్టానికి 226పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (45 బాల్స్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 83), శివం దూబే (27 బాల్స్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 52) దంచికొట్టడంతో చెన్నై 20 ఓవర్లలో భారీ స్కోర్ చేసింది. ఛేజింగ్లో గ్లెన్ మ్యాక్స్వెల్(36 బాల్స్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 76), ఫా డుప్లెసిస్ (33 బాల్స్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 62) చెలరేగినా చివర్లో తడబడ్డ ఆర్సీబీ ఓవర్లన్నీ ఆడి 218/8 స్కోరు చేసి ఓడింది. కాన్వేకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.