- బాధితులను పరామర్శించిన విశారదన్ మహరాజ్
ఖమ్మం టౌన్, వెలుగు: భూదాన్ భూమిలో జరిగిన విషాదం కమ్మ కుల సామాజికవర్గం విధ్వంసమేనని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహరాజ్ ధ్వజమెత్తారు. అంబేద్కర్ భవన్, టీటీడీసీ భవన్ లో ఉన్న వెలుగుమట్ల భూదాన్ బాధితులను పరామర్శించి మాట్లాడారు. కమ్మ, రెడ్ల ఆధిపత్యం కోసమే భూదాన్ భూమిలో ఇండ్లను ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వామపక్ష నేతలు బాధితులకు అండగా ఉండకుండా ఎందుకు అదృశ్యమయ్యారని ప్రశ్నించారు. భూదాన్ భూమిలో ఇండ్లు కూల్చివేతపై కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. తమ కార్యాచరణలో బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీలు భాగస్వాములు కావాలని కోరారు. జాగృతి అధ్యక్షురాలు కవితను కూడా మద్దతు కోరతామని తెలిపారు. భూదాన్ బాధితుల సమస్య పరిష్కరించేంత వరకు కార్యాచరణ చేపడతామని చెప్పారు.
మంత్రులు తుమ్మల, పొంగులేటి పేదల పక్షమైతే పోరాటంలో కలిసి రావాలని కోరారు. బాధితుల సమస్య తీర్చేంత వరకు భట్టి విక్రమార్కను వదలమని స్పష్టం చేశారు. ఇండ్లు కోల్పోయిన బాధితులకు అక్కడే ఇండ్లు కట్టించి ఇచ్చేంత వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు రాంబాబు, న్యాయవాది మేకల సుగుణరావు పాల్గొన్నారు.
