సైఫాబాద్, వెలుగు: గతంలో ‘హైదరాబాద్ కా పహెచాన్..హైదరాబాద్ కా పహిల్వాన్’ అనే నానుడి ఉండేదని, అలాంటిది వారికి సరైన అవకాశాలు రాక ప్రతిభ కనబరచలేక పోతున్నారని కార్మిక శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. కుస్తీ పోటీలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు మాజీ ఎంపీ , టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్కృషి చేస్తున్నారని కొనియాడారు.
ఇటీవల ఎల్బీ స్టేడియంలో అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ కేసరి–2026 పోటీల్లో గెలుపొందిన విజేతలను ఆదర్శ్ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మంత్రి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ అంటేనే పహిల్వాన్ల అడ్డా..అంజన్ కుమార్ యాదవ్ కూడా ఓ పహిల్వానే.
జిమ్లో ఆయన ఎక్సర్సైజ్లు చేసేవారు.. మా నాన్న దివంగత వెంకటస్వామి కూడా జిమ్కు వెళ్లేవారు’ అని గుర్తు చేసుకున్నారు. పోటీల్లో గెలుపొందిన వారు మరింత శిక్షణ తీసుకొని అంతర్జాతీయ స్థాయిలో రెజ్లర్లుగా రాణించాలని ఆకాంక్షించారు.
