అభివృద్ధిలో ఫెయిల్..  అవినీతిలో నంబర్ వన్ : వివేక్ వెంకటస్వామి

అభివృద్ధిలో ఫెయిల్..  అవినీతిలో నంబర్ వన్ : వివేక్ వెంకటస్వామి
  • అభివృద్ధిలో ఫెయిల్..  అవినీతిలో నంబర్ వన్
  • ఇదీ కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలన: వివేక్ వెంకటస్వామి
  • రైతులకు హామీలిచ్చి  మోసం చేసిండు 
  • కోట్లు ఖర్చు పెట్టి బోగస్ ప్రచారం 
  • కాళేశ్వరం, మిషన్ భగీరథ స్కామ్
  • విదేశాల్లో ఉత్తుత్తి అగ్రిమెంట్లతో కేటీఆర్ ఫొటోలకు  పోజులిస్తున్నడని కామెంట్ 

వరంగల్‍/హనుమకొండ, వెలుగు:  కేసీఆర్‍ తొమ్మిదేండ్ల సర్కార్ అవినీతిలో నంబర్‍ వన్‍గా ఉండగా, అభివృద్ధిలో మాత్రం ఫెయిల్‍ అయిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్‍ వెంకటస్వామి అన్నారు. మహాజన్‍ సంపర్క్ అభియాన్‍, వికాస్‍ తీర్థ్, ప్రవాస్ యోజన కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఆయన వరంగల్‍ జిల్లాలో పర్యటించారు. 

కేంద్రమంత్రి బీఎల్‍ వర్మ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‍ రెడ్డితో కలిసి గీసుగొండ మండలంలోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వరంగల్‍ సిటీలో బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్‍రావు ఇంట్లో వివేక్​మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‍ రైతులకు ఎన్నో హామీలిచ్చి మోసం చేశారని ఆయన మండిపడ్డారు. ‘‘కేసీఆర్ రైతులను కోటీశ్వరులను చేస్తానని చెప్పి.. రైతు ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చారు. రూ.లక్ష రుణమాఫీ చేస్తానని మాటిచ్చి మోసం చేశారు. రైతుబంధు రూ.10 వేల సాకుతో రూ.10 వేల కంటే ఎక్కువ విలువైన సబ్సిడీలు కట్ చేశారు. కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వకుండా, భూస్వాములకు మాత్రం ఇస్తున్నారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించి, మూడు నెలలైనా పైసా ఇవ్వలేదు” అని ఫైర్ అయ్యారు. ఫసల్​ బీమా పథకాన్ని మన రాష్ట్రంలో అమలు చేయకపోవడంతో రైతులు పంట నష్ట పరిహారం పొందలేకపోతున్నారని చెప్పారు. రాష్ట్ర సర్కార్ కనీసం రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఎకరానికి రూ.18 వేల సబ్సిడీ, పీఎం కిసాన్‍ యోజన ద్వారా మరో రూ.6 వేలు అందిస్తోందని తెలిపారు. 

ఇంటింటికీ నీళ్లు రావట్లే.. 

రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం, మిషన్‍ భగీరథ ప్రాజెక్టుల పేరుతో పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడిందని వివేక్‍ ఆరోపించారు. ‘‘ఇంటింటికీ మిషన్‍ భగీరథ నీళ్లు అందడం లేదు.  ఇక కాళేశ్వరం రూ.33 వేల కోట్లతో కంప్లీట్‍ చేస్తామని చెప్పి, దాన్ని రూ.లక్ష కోట్లకు పెంచారు. రూ.లక్ష కోట్లు ఎందుకు ఖర్చయిందో? ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో? వైట్ పేపర్ రిలీజ్ చేయాలి” అని డిమాండ్ చేశారు. పైగా కాళేశ్వరం గొప్ప ప్రాజెక్టు అంటూ రూ.కోట్లు ఖర్చు పెట్టి పత్రికల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికలు వస్తేనే కేసీఆర్‍, కేటీఆర్ కు వరంగల్‍ మామునూర్‍ ఎయిర్ పోర్టు గుర్తుకువస్తోందని ఎద్దేవా చేశారు. ‘‘వరంగల్ లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ పెడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. కానీ ఆరేండ్లలో చేసిందేమీ లేదు. భూములు ఇచ్చినోళ్లకు ఉద్యోగాలు, డబుల్‍ బెడ్‍రూమ్ ఇండ్లు ఇవ్వలేదు. రైతుల వద్ద ఒక్కో ఎకరాన్ని రూ.8 లక్షలకు గుంజుకుని, కంపెనీలకు రూ.80 లక్షల చొప్పున అమ్ముకుంటున్నారు” అని ఆరోపించారు. పార్క్ కోసం భూములు కోల్పోయిన 700 మంది రైతు కుటుంబాలతో పాటు స్థానికులకు ఉద్యోగాల్లో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్‍ చేశారు. టెక్స్ టైల్ పార్క్ విషయంలో కేంద్రం కావాల్సిన సాయం చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు విషయంలో పూర్తి వివరాలతో సంప్రదించాలని సూచించారు.  

రూ.కోట్లు ఖర్చు పెట్టి యాడ్స్.. 

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల్లో అవినీతి జరుగుతుండగా, దాన్ని దాచి పెట్టి రూ.కోట్లతో యాడ్స్ ఇచ్చి బోగస్‍ ప్రచారం చేస్కుంటున్నారని వివేక్ మండిపడ్డారు. ‘‘కాళేశ్వరం విషయంలో అమెరికా సంస్థకు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్లే వాళ్లు అవార్డులు ఇచ్చారు. దాన్ని మంత్రి కేటీఆర్‍ దాస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణ తీరు, అందులో జరిగిన అవినీతిపై ఆ సంస్థకు లెటర్‍ రాస్తాను” అని తెలిపారు. ‘‘మంత్రి కేటీఆర్ విదేశాలకు వెళ్లి రాష్ట్రానికి కార్పొరేట్‍ కంపెనీలు తెస్తున్నట్టు ఫొటోలకు ఫోజులివ్వడం, అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసినట్లు బిల్డప్‍ ఇవ్వడం తప్పించి చేసిందేమీ లేదు. కేటీఆర్ తో కొరియా వెళ్లిన సమయంలో ఆయన తీరును గమనించాను. కేంద్ర ప్రభుత్వం ప్రపంచస్థాయి కంపెనీలను దేశంలోకి తీసుకువచ్చే క్రమంలో వాటికి సబ్సిడీలు ఇవ్వడం వల్లే గూగుల్‍, అమెజాన్‍, ఆపిల్‍ వంటి కంపెనీలు వచ్చాయి” అని చెప్పారు. కార్యక్రమంలో వరంగల్‍ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‍, హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, డాక్టర్‍ విజయ్‍చందర్‍రెడ్డి, మురళీధర్‍ గౌడ్‍, ఎడ్ల అశోక్‍ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.