కేసీఆర్ రాక్షస పాలనను గద్దె దించేందుకు కాంగ్రెస్ లో చేరానని చెప్పారు వివేక్ వెంకటస్వామి. తనకు టికెట్ ముఖ్యం కాదని కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటమే లక్ష్యమన్నారు. హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో రాహుల్ సమక్షంలో వివేక్.. తన కుమారుడు వంశీకృష్ణతో కలిసి కాంగ్రెస్ లో చేరారు.
ఈ సందర్బంగా మాట్లాడిన వివేక్ వెంకటస్వామి.. తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. సోనియా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని.. రాష్ట్రం వచ్చినా ప్రజల ఆకాంక్ష నెరవేరలేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ ను గద్దె దించాల్సిన అవసరముందన్నారు.. అందరం కలిసి కట్టుగా కేసీఆర్ ను గద్దె దించుతామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకారం పనిచేస్తానని చెప్పారు. తెలంగాణ సాధనలో తమ కుటుంబం ఎంతో కృషి చేసిందని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి వెయ్యి ఏనుగుల బలం: రేవంత్
వివేక్ వెంకటస్వామి కుటుంబం కాంగ్రెస్ లో చేరికతో.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వెయ్యి ఏనుగుల బలం వచ్చిందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ వరకు.. మూడు తరాలుగా వివేక్ వెంకటస్వామి కుటుంబంతో అనుబంధాన్ని గుర్తు చేశారాయన. పార్టీలో అందరితో చర్చించి.. పార్టీ ఆహ్వానం మేరకు చేరినట్లు వెల్లడించారు రేవంత్ రెడ్డి. వివేక్ వెంకటస్వామి కుటుంబం కాంగ్రెస్ పార్టీలో చేరికతో.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వెయ్యి ఏనుగుల బలం వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్ లో కొట్లాడిన ఎంపీల్లో వివేక్ ఉన్నారన్నారు. మార్పు రావాలి.. కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు.