సమస్యలు పరిష్కరించేంతవరకు ఓట్లెయ్యం 

సమస్యలు పరిష్కరించేంతవరకు ఓట్లెయ్యం 
  •     రోడ్ల సమస్యే ప్రధానంగా  ఎన్నికల బహిష్కరణ
  •     ఆగమేఘాలపై గ్రామాలకు అధికారుల పరుగులు
  •     వీలైనంత తొందరలో సాల్వ్​ చేస్తామని హామీలు
  •     చాలాచోట్ల అంగీకరించి ఓట్లేసిన గ్రామస్తులు  
  •     గంటల పాటు టెన్షన్​పడ్డ అధికార యంత్రాంగం 

మహబూబ్​నగర్/నాగర్​కర్నూల్: ఏండ్లుగా పేరుకుపోయిన తమ సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం పలు గ్రామాలు, తండాల్లో ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. ఇందులో ఎక్కువ మంది రోడ్ల సమస్యనే ప్రస్తావించారు. మహబూబ్​నగర్​అర్బన్​ మండలం ఎదిర గ్రామస్తులు అమర రాజా ఫ్యాక్టరీ కట్టవద్దంటూ ఎన్నికలను బహిష్కరించారు. ఈ గ్రామంలో నాలుగు వేల మంది ఓటర్లున్నారు.

ఊరికి సమీపంలోనే అమర రాజా ఫ్యాక్టరీని నిర్మిస్తుండగా, ఫ్యాక్టరీ వద్దంటూ కొద్ది రోజులుగా గ్రామస్తులు దీక్షలు చేస్తున్నారు. ఎవరూ స్పందించకపోవడంతో సోమవారం పోలింగ్​ను బహిష్కరించారు. ఆఫీసర్లు వచ్చి ఓట్లు వేయాలని రిక్వెస్ట్​ చేసినా వినలేదు. సాయంత్రం ఆరు గంటల వరకు వేచి చూసిన ఆఫీసర్లు చేసేదేమీ లేక వెళ్లిపోయారు  

అమరగిరిలో అధికారుల హామీతో ఓటింగ్

నాగర్ కర్నూల్​జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరిలో ఆదివాసీ చెంచు కుటుంబాలు కరెంట్, మంచినీళ్లు, రోడ్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని, హెల్త్ సెంటర్  ఏర్పాటు చేయాలనే డిమాండ్లతో ఎన్నికలను బహిష్కరించారు. బిల్లులు కట్టలేదని కరెంట్​సప్లై నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ 277 మంది ఓటర్లుండగా, సమస్యలు పరిష్కరించేంత వరకు ఓట్లు వేయమని తేల్చి చెప్పారు. కొల్లాపూర్ తహసీల్దార్ శ్రీకాంత్  విద్యుత్​శాఖాధికారులతో కలిసి వెళ్లి కరెంట్​సమస్యను పరిష్కరించారు. మిగిలిన వాటికి టైం ఇవ్వాలని అడగడంతో 11గంటల తర్వాత ఓటు హక్కు వినియోగించుకున్నారు.  

పోలింగ్​ సెంటర్​ కోసం..

రంగారెడ్డి ​జిల్లా కొత్తూరు మండలం కొడిచర్ల తండాలో 500 పైచిలుకు ఓట్లున్నా, పోలింగ్ స్టేషన్​ను ఏర్పాటు చేయలేదంటూ ధర్నా చేశారు. ఆఫీసర్లు తండాకు వచ్చి మాట్లాడారు. ప్రతిసారీ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొడిచర్లకు వెళ్లి ఓట్లు వేయాల్సి వస్తోందని, బస్సు సౌకర్యం కూడా లేకపోవడంతో నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తోందన్నారు. బస్సు  నడిపిస్తామని, వచ్చే ఎన్నికల్లో తండాలోనే పోలింగ్​సెంటర్​ ఏర్పాటు చేసేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారులు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించి మధ్యాహ్నం వేళ ఓటింగ్​లో పాల్గొన్నారు.  

రోడ్డు సౌకర్యం లేదని .. 

కాగ జ్ నగర్/కడెం/ఆదిలాబాద్/బెల్లంపల్లి రూరల్: తమ ఊరికి రోడ్డు సౌకర్యం లేదని.. రోడ్డు, బ్రిడ్జి నిర్మాణం చేపట్టేవరకు ఓట్లు వేయబోమని ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్ నగర్ మండలం బోరిగాం గ్రామస్తులు స్పష్టం చేశారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్​చార్జి రావి శ్రీనివాస్ గ్రామానికి చేరుకొని వారితో మాట్లాడారు. మంత్రి సీతక్కతో ఫోన్ లో మాట్లాడించారు. ఊరికి రోడ్డు వేయడం, బ్రిడ్జి కట్టడం ప్రభుత్వ బాధ్యత అని హామీ ఇవ్వడంతో చెప్పడంతో ఓట్లు వేశారు. నిర్మల్ జిల్లా కడెం మండలం అల్లంపల్లి, బాబానాయక్ తండా గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేదని, రోడ్డు వేసేంత వరకు ఓట్లు వేసేది లేదంటూ సుమారు 1500 మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేదు.

అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్, ఏఎస్పీ సూర్యనారాయణ, ఇన్​చార్జ్ డీఎస్పీ రమణమూర్తి గ్రామాలకు వెళ్లి వీలైనంత తొందరగా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో మధ్యాహ్నం 2 గంటలకు ఓట్లేశారు.  మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని వరిపేట గ్రామస్తులు తమ గ్రామాన్ని ప్రత్యేక గ్రామపంచాయతీగా గుర్తించాలని ఎన్నికలను బహిష్కరించారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా కొత్తవరిపేట, పాత వరిపేట గ్రామాలను కలిపి గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని గంటన్నరకు పైగా పోలింగ్​కు వెళ్లలేదు.

ఇప్పుడు కూడా అలాగే చేయడంతో కాసిపేట ఎస్​ఐ ప్రవీణ్​కుమార్ ​రెవెన్యూ అధికారులతో మాట్లాడి గ్రామస్తులకు నచ్చజెప్పడంతో మధ్యాహ్నం ఓటు హక్కు వినియోగించుకున్నారు.  ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని బాబ్జీపేట గ్రామస్తులు రోడ్డు లేదని, త్రీఫేజ్ కరెంట్ సౌకర్యం కల్పించాలని ఎన్నికలను బహిష్కరించారు.  సాయంత్రం 4 గంటల వరకు కూడా ఓటు వేసేందుకు ముందుకు రాలేదు. అధికారులు కలెక్టర్​కు సమాచారం ఇవ్వడంతో ఆయన గ్రామస్తులతో మాట్లాడారు.  సమస్య పరిష్కరrస్తానని హామీ ఇవ్వడంతో ఓటింగ్ లో పాల్గొన్నారు.

బజార్​హత్నూర్​ మండలంలోని మాన్కాపూర్​లో కూడా రోడ్డు కోసం ఓట్లు వేయకపోవడంతో ఎన్నికల అధికారులు చొరవ తీసుకుని హామీ ఇచ్చారు. దీంతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదే మండలంలోని ముంపు గ్రామం దేహగాం గ్రామస్తులు కూడా ఎన్నికలను బహిష్కరించారు. గతంలో తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారని, కానీ, అది నెరవేర్చకపోవడంత ప్రతి వర్షాకాలంలో గ్రామం నీట మునుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్, ఎన్నికల అధికారుల హామీతో ఓటింగ్ లో పాల్గొన్నారు. 

పోలింగ్ కేంద్రం వద్ద రైతుల ధర్నా

భూదాన్ పోచంపల్లి : యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి  మండలంలోని కనుముక్కులలో తడిసిన ధాన్యాన్ని కొనాలంటూ రైతులు గంటసేపు పోలింగ్​ను బహిష్కరించారు. ఆదివారం వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం బస్తాలను పోలింగ్​ సెంటర్​కు అడ్డుగా వేసి ధర్నా చేశారు.  పోలీసులు, అధికారులు సర్ది చెప్పినా వినలేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు, మిల్లుల యజమానులు స్పష్టమైన హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.  

మైలారంలో ఆరుగురే ఓట్లేసిన్రు..

నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట మండలం మైలారంలో తమ అభిప్రాయానికి వ్యతిరేకంగా గ్రామ సమీపంలోని గుట్టను మైనింగ్  చేయడానికి పర్మిషన్​ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. నెల రోజుల ముందే వారు ఎలక్షన్లను బహిష్కరిస్తామని గ్రామంలో వాల్ పోస్టర్లు వేశారు. అచ్చంపేట ఆర్డీవో మాధవీలత ఊరికి వచ్చి గ్రామస్తులకు కౌన్సిలింగ్  ఇచ్చారు. మైనింగ్ రద్దు చేస్తామని హామీ ఇస్తేనే ఓటింగ్​లో పాల్గొంటామని తేల్చి చెప్పారు. ఇక్కడ 783 మంది ఓటర్లుండగా, ఆరుగురు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు.