V6 News

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో షాకింగ్ ఘటన: మద్యం మత్తులో బ్యాలెట్ పేపర్ మింగిన ఓటర్

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో షాకింగ్ ఘటన: మద్యం మత్తులో బ్యాలెట్ పేపర్ మింగిన ఓటర్

హైదరాబాద్: తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ ఓటర్ బ్యాలెట్ పేపర్ నమిలి మింగాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామంలో తొలి విడతలో భాగంగా గురువారం (డిసెంబర్ 11) పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో ఓటు వేసేందుకు వచ్చిన వెంకట్ అనే ఓటర్ మద్యం మత్తులో బ్యాలెట్ పేపర్లను నమిలి మింగాడు. 

బాక్స్‎లో వేయాల్సిన వైట్ కలర్ వార్డు మెంబర్ బ్యాలెట్ పేపర్‎ను నమిలి మింగిన వెంకట్.. పింక్ కలర్ సర్పంచ్ బ్యాలెట్ పేపర్‎ను నమిలి ఊంచాడు. గమనించిన అధికారులు వెంకట్‎ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఎన్నికల సంఘం అధికారుల ఫిర్యాదు మేరకు వెంకట్‎పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‎గా మారగా నెటిజన్లు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. అభ్యర్థులు ఇచ్చిన మద్యం తాగి ఆ మత్తులోనే బ్యాలెట్ పేపర్ నమిలి పారేశాడంటూ కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. 

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. గురువారం (డిసెంబర్ 11) ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. పోలింగ్ సమయం ముగిసినా చాలా చోట్ల ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరారు. దీంతో పోలింగ్ కేంద్రాల గేట్లు మూసి మధ్యాహ్నం 1 గంటల లోపు క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు ఎన్నికల సంఘం అధికారులు. 

భోజన విరామం తర్వాత మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్​చేపట్టి విజేతలను ప్రకటించనున్నారు. ఆ వెంటనే గెలుపొందిన సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రత్యేకంగా సమావేశమై ఉప సర్పంచ్‌లను ఎన్నుకోనున్నారు. తొలి విడతలో 3,834 సర్పంచ్, 27,628 వార్డ్ మెంబర్ స్థానాలకు పోలింగ్ జరిగింది.

కొన్ని చోట్ల చెల్లాచెదురు ఘటనలు మినహా మిగిలిన అన్నీ చోట్ల పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు.. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని అబ్జర్వ్ చేశారు. అత్యధికంగా వరంగల్, అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ పర్సంటేజ్ నమోదైనట్లు సమాచారం.