- కుక్కర్లు రోడ్డుపై వేసి నిరసన తెలిపిన కాలనీవాసులు
అశ్వారావుపేట, వెలుగు : తమ వద్ద కుక్కర్లు తీసుకొని తమకు ఓటు వేయలేదని, తాము ఇచ్చిన కుక్కర్లు తిరిగి ఇచ్చేయాలని ఓ కౌన్సిలర్ క్యాండిడేట్ అనుచరుడు కాలనీవాసులతో గొడవకు దిగాడు. దీంతో కాలనీవాసులు కుక్కర్లను రోడ్డుపై వేసి నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే... భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట పట్టణంలోని ఏఎస్ఆర్ నగర్ కౌన్సిలర్ క్యాండిడేట్గా కాంగ్రెస్ తరఫున మిండా హరిబాబు పోటీచేశారు.
ఆయన అనుచరుడు బాలాజీ గురువారం మద్యం సేవించి ‘పోలింగ్కు ముందు రోజు కుక్కర్లు తీసుకున్న వారు మాకు ఓటు వేయలేదు.. కుక్కర్లు తిరిగి ఇచ్చేయండి’ అంటూ గొడవకు దిగాడు. దీంతో కాలనీవాసులు కుక్కర్లు తీసుకొచ్చి రోడ్డుపై వేసి నిరసన తెలిపారు. అనంతరం వాటిని తీసుకొని బాలాజీ ఇంటికి వెళ్లి అక్కడే వదిలేశారు. ఈ విషయం తెలుసుకున్న కౌన్సిలర్ క్యాండిడేట్ హరిబాబు తాను అలా అనలేదని, ఎవరో చేసిన వ్యాఖ్యలను తనకు ఆపాదించొద్దని కాలనీవాసులకు నచ్చజెప్పడంతో వారు కుక్కర్లను తిరిగి తీసుకెళ్లారు.
