కష్టపడలేనప్పుడు రిటైర్మెంటే:చిరంజీవి

కష్టపడలేనప్పుడు రిటైర్మెంటే:చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'వాల్తేరు వీరయ్య' అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని  మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. అల్బమ్ లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్, పూనకాలు లోడింగ్ పాటలు  బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.  ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న  'వాల్తేరు వీరయ్య' జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతున్న నేపధ్యంలో మెగాస్టార్ చిరంజీవి విలేఖరుల సమావేశంలో 'వాల్తేరు వీరయ్య'  విశేషాలని పంచుకున్నారు. 

ప్రశ్న: వాల్తేరు వీరయ్యలో వింటేజ్ వైబ్ కనిపిస్తోంది.షూటింగ్ చేస్తున్నపుడు ఆ క్యారెక్టర్  వలన మళ్ళీ యంగేజ్ వైబ్ వచ్చిందా ? 

చిరంజీవి: ప్రేక్షకులు, అభిమానులు తనను కమర్షియల్ సినిమాల్లో చూడటాడానికే ఎక్కువగా ఇష్టపడతారు.తనకు మాత్రం అన్ని రకాల వైవిధ్యమైన పాత్రలు చేయాలని వుందని చెప్పారు. శుభలేఖ, స్వయంకృషి, మంత్రి గారి వియ్యంకుడు లాంటి చిత్రాలు వివిధ్యమైన పాత్రలు చేయాలనే తాపత్రయం నుండి వచ్చినవే అని చెప్పారు.అయితే రానురాను..ఆర్ధికంగా కమర్షియల్ గా ముడిపడిన ఈ పరిశ్రమలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ మేలుని ద్రుష్టిలో పెట్టుకొని..  మనకి ఏం కావాలనేదాని కంటే ప్రేక్షకులు మన నుండి ఏం కోరుకుంటున్నారో.. అది ఇవ్వడానికే మొదటి ప్రాధన్యత ఇచ్చానని తెలిపారు. కమ్ బ్యాక్ లో కూడా ఫ్రీడమ్ ఫైటర్ సైరా, పాటలు, హీరోయిన్ లేకుండా పవర్  ఫుల్ పాత్రగా గాడ్ ఫాదర్ చేశాను. ఇవన్నీ కూడా గౌరవప్రదమైన హిట్లు అందుకున్నాయి. అయితే ప్రేక్షకులు తన నుండి ఏం కోరుకుంటున్నారో అది వందకి వందశాతం ఇవ్వాలనే ప్రయత్నంతో వాల్తేరు వీరయ్య చేశానని చెప్పారు. ఇది కచ్చితంగా ప్రేక్షకులని అలరిస్తుంది. మరోసారి వింటేజ్ చిరంజీవిని గుర్తు చేసుకునే అవకాశం వుంటుంది. ముఠామేస్త్రీ, ఘరానామొగుడు, రౌడీ అల్లుడు లాంటి చిత్రాలని రీ కలక్ట్ చేసుకునే అవకాశం ఇచ్చింది వాల్తేరు వీరయ్య. షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశాను. దీనికి ప్రధాన కారణం దర్శకుడు బాబీ కూడా. తను ఏం చూడాలని అనుకుంటున్నాడో అవన్నీ తన నుండి రాబట్టుకోవడం కోసం చాలా తపనతో పని చేశాడు. షూటింగ్ చాలా ఉత్సాహంగా జరిగిందని చెప్పారు మెగాస్టార్.

ప్రశ్న: మీరు చాలా అనుభవం గల హీరో.. కొత్త దర్శకులతో పని చేస్తున్నపుడు వారికీ కావాల్సిన ఫ్రీడమ్ ని ఎలా క్రియేట్ చేస్తారు ? 

చిరంజీవి: తాను ఎప్పుడు మానిటర్ చూడను. నేను షాట్ చేస్తున్నప్పుడు దర్శకుడు ‘ఓకే’ అన్నంతవరకూ అక్కడి నుండి కదలను. తానెప్పుడూ దర్శకుడి ‘ఓకే’ కోసం ఎదురుచూస్తాను. కొత్త యాక్టర్ ని డీల్ చేస్తున్న కంఫర్ట్ దర్శకులకు ఇస్తాను. 

ప్రశ్న: మొన్న రిటైర్ మెంట్ గురించి  చేసిన కామెంట్స్ చర్చనీయంశమయ్యాయి ? 

చిరంజీవి:కష్టపడే తత్త్వం లేనప్పుడు రిటైర్ మెంట్ తీసుకోవడమే మంచిదని అన్నాను. కెరీర్ మొదట్లో ఒక ఆకలి వుంటుంది. ఒక పేరు తెచ్చుకోవాలి, మనల్ని మనం తెరపై చూసుకోవాలనే స్పిరిట్ .. కొంతకాలం తర్వాత ఎందుకు వుండకూడదు. కష్టపడాలి. అమితాబ్ బచ్చన్ ఇప్పటికీ హార్డ్ వర్క్ చేస్తారు. ఇక్కడ ఎప్పుడూ అర్ద ఆకలితో వుండాలి. కడుపు నిండిన వ్యవహారం లా వుంటే మాత్రం అనుకున్నది డెలివర్ చేయలేవని చెప్పడమే నా ఉద్దేశం. 

ప్రశ్న: ఇన్నేళ్ళ తర్వాత కూడా ఏ ఎలిమెంట్ మిమ్మల్ని ఆ ఆకలి, కసితో డెలివర్ చేస్తోంది ? 

చిరంజీవి: కేవలం ప్రేక్షకుల యొక్క ఆదరణ తన డ్రైవింగ్ ఫోర్స్. వాళ్ళు ఆదరిస్తున్నారు కాబట్టే చేయగాలుగుతున్నాని చిరంజీవి చెప్పారు.బావగారు బాగున్నారా లో బంగీ జంప్ చేస్తున్నపుడు.. ఇది ప్రేక్షకులు చూస్తే ఎంత ఎక్సయిట్ గా ఫీలౌతారు..వాట్ ఏ ఫీట్ అని క్లాప్స్ కొడతారని ఊహించుకున్న తర్వాత ఎక్కడలేని ఎనర్జీ వచ్చిందన్నారు.చాలా రిలాక్స్ గా దూకాను. ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ తనను ముందుకు నడిపిస్తుందన్నారు.

ప్రశ్న:రవితేజలో అప్పటికి ఇప్పటికి ఏం తేడాలు గమనించారు ? 

చిరంజీవి: రవితేజ అప్పటికి ఇప్పటికి ఒకే మనిషి. ఇమేజ్ వచ్చిన తర్వాత తనలో వచ్చిన మార్పులు ఏమీ లేవు. అదే ఎనర్జీ తో ఉన్నాడు. తన ఆహారపు అలవాట్లు కూడా మారలేదు. అప్పటికి ఇప్పటికి అదే ప్రేమ, ఉత్సాహం వున్నాయి. వాల్తేరు వీరయ్య లో రవితేజ పాత్ర కథకు మరింత బలం చేకూరుస్తుంది. తన పాత్రలో చాలా ఎమోషన్ వుంటుంది. ఆ పాత్రకు చక్కని న్యాయం చేశాడని చెప్పారు.  

ప్రశ్న: ఒక పాట కోసం భారీ సెట్ వేశారు కదా... మైత్రీ మూవీ మేకర్స్ మేకింగ్ గురించి  ? 

చిరంజీవి: మైత్రీ మూవీ మేకర్స్ లాంటి నిర్మాతలు చాలా అరుదుగా వుంటారు. ఖర్చుకు వెనకడుగు వేయకుండా ఒక ప్యాషన్ తో సినిమాలు చేస్తున్నారని మెగాస్టార్ చెప్పారు. ‘ఖర్చు విషయంలో జాగ్రత్త. మీ లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలి’అని చెబుతుంటాను. బాబీ కి కూడా అదే విషయం చెప్పాను. ఎక్కడ వృధా కాకుండా బాబీ చక్కని పనితనం చూపించాడు. దాని వలన నిర్మాతలకు కూడా చాల కలిసొచ్చింది. నిర్మాతల బాగోగులు చూడాల్సిన బాధ్యత దర్శకులపై కూడా వుంది. షూటింగ్ లో ఒక రోజుకి నలభై లక్షల రూపాయిలు కూడా ఖర్చు అయ్యేది. మారేడిమిల్లి లో షూట్ చేస్తున్నపుడు అక్కడ ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిది. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ తో కూర్చుని ప్లాన్ చేసి ఎక్కడా వృధా కాకుండా చేయగలిగాం. మలేసియాలో కూడా షూట్ చేశామని తెలిపారు.

ప్రశ్న:సంక్రాంతికి మీ సినిమా ఎప్పుడూ ముందు వస్తుంది. ఈ సారి లాస్ట్ వస్తున్నారు. ఆ నిర్ణయం కూడా మీదే అని తెలిసింది ? 

చిరంజీవి:మా సంస్థ నుండి రెండు సినిమాలు అనేసరికి చాలా హ్యాపీగా ఫీలయ్యాను. పండగ ఎన్ని సినిమాలైనా తీసుకుంటుంది. ఒక రోజు గ్యాప్ ఇస్తే గనుక ఏ సినిమా రెవెన్యూ ఆ సినిమాకి వుంటుంది. అందుకే తానే వెనుకకు జరుగుతానని చెప్పాను. 

ప్రశ్న: మరి అప్పటికే విడుదలైన సినిమాల వలన థియేటర్లు టైట్ అవుతాయి కదా .. ?

చిరంజీవి: ఫస్ట్ డే రికార్డ్ కోసం తాపత్రయపడే వారైతే గనుక మా రెవెన్యు తగ్గిపోతుందనే ఫీలింగ్ వుంటుంది. రావాల్సిన షేర్ వస్తుందనే నమ్మకం వుంటే గనుక ఎప్పుడు ఎలా విడుదల చేసినా ఇది నిలబడి తీరుతుంది. 

ప్రశ్న:వాల్తేరు వీరయ్యలో అవుట్ ఫీట్స్ బావున్నాయి కదా ?  గతంలో ఇంద్ర సినిమా షర్ట్స్ ట్రెండ్ అయ్యాయి.. వీరయ్య కూడా అలా జరుగుతుందా ? 

చిరంజీవి: గతంలో ఇంద్ర, గ్యాంగ్ లీడర్ షర్ట్ లు చాలా ట్రెండ్ అయ్యాయి. వాల్తేరు వీరయ్యలో ఒక ఫిషర్ మ్యాన్ క్యారక్టర్. తను రిచ్ గా వుండే అవకాశం వుంది. సుస్మిత చాలా మాసీగా డిజైన్ చేసింది. గతంలో ఇంత మాసీ అవుట్ ఫిట్స్, కాస్ట్యూమ్స్ ఎప్పుడూ వేయలేదు.  

ప్రశ్న: గత ముఫ్ఫై ఏళ్ళలో టెక్నాలజీ చాలా మారింది. బాబీ ఒక అభిమానిగా మిమ్మల్ని ఎలా చూపించబోతున్నాడు ? 

చిరంజీవి: నేను కంటెంట్ ని బలంగా నమ్ముతాను. బాబీ కూడా కంటెంట్ ని నమ్ముతాడు. అందుకే మా ఇద్దరికి చక్కగా కుదిరింది. దిని అవసరం మేరకు టెక్నాలజీ ని వాడుకోవడం జరిగింది. బాబీ ఫ్యాన్ గా కంటే డైరెక్టర్ గా ఎక్కువ మార్కులు సంపాయించాడు. 

ప్రశ్న: వాల్తేరు వీరయ్యలో రవితేజ, మీరు డైలాగులు మార్చుకోవడం ఎలా అనిపించిది ? 

చిరంజీవి: ఒక ఫ్యాన్ బాయ్ గా దర్శకుడికి వచ్చిన ఆలోచన ఇది. దీనికి ఇద్దరం ఆమోదించాం. నన్ను ఇష్టపడే రవితేజ కి నా డైలాగ్ చెప్పడం తనకి ఫ్యాన్ బాయ్ మూమెంట్. అలాగే నా తమ్ముడి లాంటి రవితేజ డైలాగ్ ని నేను చెప్పడం సరదాగా అనిపించింది. 

ప్రశ్న: వాల్తేరు వీరయ్యలో ఎంటర్ టైన్ మెంట్ కి ఎంత అవకాశం వుంది ? 

చిరంజీవి: ఒక ముఠామేస్త్రీ, ఘరానామొగుడు, అన్నయ్యలో ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ రైజేషన్ తో పోల్చుకోవచ్చు. ప్రతి సీన్ ఎంటర్ టైన్ చేస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ పిల్లలతో వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు. 
 
ప్రశ్న:బాబీ ఈ కథ చెప్పినప్పుడు మిమ్మల్ని ఆకర్షించిన ప్రధాన అంశం ? 

చిరంజీవి: ఏదైనా కథ విన్నప్పుడు అందులో ముఖ్యంగా ఎమోషన్ చూస్తాను. పాటలు, ఫైట్లు అదనపు అలంకరణలు. ఎమోషన్ కనెక్ట్ అయితేనే ప్రేక్షకులని హత్తుకుంటుంది. వాల్తేరు వీరయ్య కథ లో అంత గొప్ప ఎమోషన్ వుంది. అందుకే బాబీ చెప్పిన కథ విన్న వెంటనే మరో ఆలోచన లేకుండా ఓకే చేశాను. 

ప్రశ్న: శ్రుతి హాసన్ తో ఇందులో మీ కెమిస్ట్రీ ఎలా వుంటుంది ? డ్యాన్సులు ఎలా వుంటాయి?

చిరంజీవి: తను కమల్ హాసన్  కూతురు. తన డీఎన్ ఏ లోనే డ్యాన్స్ వుంది. అవలీలగా డ్యాన్స్ చేస్తుంది. అయితే చాలా చలి లో డ్యాన్స్ చేయడం ఒక సవాలే. తను చాలా హార్డ్ వర్క్ చేసింది. తనకి పని పట్ల అంకితభావం ఎక్కువ. తనతో మళ్ళీ వర్క్  చేయాలని వుందని చిరంజీవి తన మనసులో మాట బయటపెట్టారు.. 

ప్రశ్న: ఇప్పుడు కథల విషయంలో కొరత ఉందా ? 

చిరంజీవి: లేదండీ. చాలా కొత్త దర్శకులు మంచి మంచి కథలతో వస్తున్నారు. అర్జున్ రెడ్డి, ఉప్పెన, జాతిరత్నాలు, పెళ్లి చూపులు ఇవన్నీ మంచి కంటెంట్ వున్న కథలే కదా.. చాలా మంచి ప్రతిభ వున్న దర్శక, రచయితలు వస్తున్నారు. కథల విషయంలో కొరత లేదు.

ప్రశ్న: రిమేక్ సినిమాలు చేయడం రిస్క్ తో కూడుకున్నదా ? 

చిరంజీవి: ఒక రిమేక్ కథ చేస్తున్నపుడు మన హీరో ఇందులో ఎలా ఉంటాడనే క్యురియాసిటీ వుంటుంది. గాడ్ ఫాదర్ విజయానికి కారణం కూడా ఇదే. కొన్ని మంచి మార్పులు చేసి ఇది చేశాం. అప్పటికే ఆ సినిమా మాతృక చూసినప్పటికీ గాడ్ ఫాదర్ ని కూడా ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు వేదాలం రీమేక్ చేస్తున్నాను. దినిని కూడా చాలా డిఫరెంట్ గా ప్రజంట్ చేస్తున్నాం. 

ప్రశ్న: దేవిశ్రీ మ్యూజిక్ గురించి ? 

చిరంజీవి: దేవిశ్రీ చాలా ఎనర్జిటిక్ గా ఉంటాడు. వాల్తేరు వీరయ్య మ్యూజిక్ చాలా మనసు పెట్టి చేశాడు. నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి పాట చాలా చిలిపితనంతో రాసి చేశాడు. అలాగే బాస్ పార్టీ కూడా. ఇందులో వుండే పాటలన్నీ నాకు ఇష్టం. నీకేమో అందం ఎక్కువ పాట కూడా నాకు చాలా ఇష్టం. నా ఫేవరేట్ సాంగ్ ఇది.

ప్రశ్న: బాబీ సింహా గురించి చెప్పండి ? 

చిరంజీవి: బాబీ సింహా జాతీయ అవార్డ్ పొందిన నటుడు. నా సినిమాల్లో డైలాగులు పాటలు అవలీలగా చెప్పాడు. తనది తమిళనాడు అనుకున్నాను. తెలుగే అని తెలిసి సర్ప్రైజ్ అయ్యాను. తను కూడా ఫ్యాన్స్ బాయ్. ఈ సినిమాలో అద్భుతంగా చేశాడు. 

ప్రశ్న: దర్శకుడు బాబీతో పని చేయడం గురించి ? 

చిరంజీవి: బాబీకి తాను ఫ్యాన్ అయ్యాను అని ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెప్పాను. అతని హార్డ్ వర్క్ చూసి ఫ్యాన్ అయ్యాను. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత చిన్న దినం అయిన వెంటనే అంత బాధని దిగమింగుకొని ఇక్కడ వచ్చి పని చేశాడు. అతని కమిట్ మెంట్ కి హ్యాట్సప్. అతని కమిట్ మెంట్ కి ఫ్యాన్ అయ్యానని చెప్పారు చిరంజీవి.

ప్రశ్న:దర్శకత్వం చేయాలనే ఆలోచన వుందా ? 

చిరంజీవి: జీవితాంతం సినిమాతో మమేకం అవ్వాలనే వుంది. ఏదొక ఒక సమయంలో ఆలాంటి సందర్భం వచ్చి,  దర్శకత్వం చేయగలననే నమ్మకం వస్తే గనుక దర్శకత్వం చేస్తాను. 

ప్రశ్న:టికెట్ రేటు ని 25 రూ. పెంచుకునే వెసులుబాటు ఏపీ ప్రభుత్వం కల్పించింది. అలాగే ఆరు షోలు వేసుకునే అవకాశం తెలంగాణ ప్రభుత్వం కల్పించింది కదా? 

చిరంజీవి:ప్రభుత్వ నిర్ణయాలని మనం గౌరవించాలి. ఈ వెసులు బాటు కల్పించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.  

ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు  గోల్డెన్ గ్లోబ్ అవార్డు  దక్కడం ఆనందంగా ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్కు నా అభినందనలు. ఇదొక చారిత్రక విజయం. దేశం గర్వించే విజయమని మెగాస్టార్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.