
- ప్రపోజల్స్ రెడీ చేసిన మత్స్య శాఖ అధికారులు
- చేప పిల్లలకు బదులు నగదు ఇవ్వాలంటున్న మత్స్యకారులు
వనపర్తి, వెలుగు: వానకాలం ప్రారంభం కావడంతో చేప పిల్లల పంపిణీకి అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రపోజల్స్ సిద్ధం చేశారు. వనపర్తి జిల్లాలో ఈ సీజన్లో 2 కోట్ల చేపల పంపిణీకి మత్స్య శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లావ్యాప్తగా 900 చెరువులు, కుంటల్లో వీటిని వదలాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమం వల్ల 142 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లోని 13,674 మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరనుంది.
కట్ల, రాహు, బొత్స, బంగారుతీగ తదితర రకాల చేపపిల్లలను చెరువుల్లో వదలనున్నారు. ఒక ఇంచు నుంచి రెండు, మూడు ఇంచుల పిల్లలను పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. చెరువులు, కుంటల్లో వదిలిన చేపపిల్లలను పట్టే అధికారం మత్స్య కార్మిక సొసైటీ సభ్యులకే ఉంటుంది. ఈ మేరకు చేపలు పట్టడం, ఈత, వలలు అల్లడం, విసరడం వచ్చిన వారిని గుర్తించి సొసైటీల్లో సభ్యత్వం ఇచ్చారు.
పెబ్బేరులో ఉత్పత్తి కేంద్రం..
జిల్లాలోని మదనాపూర్ మండల కేంద్రంలో చేపల ఉత్పత్తి కేంద్రం ఉంది. అక్కడ సరిపోను స్టాఫ్ లేకపోవడంతో అది నిరుపయోగంగా మారింది. దీనికి ఏడీగా జిల్లా మత్స్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వ్యవహరిస్తారు. అది నిరుపయోగంగా మారడంతో పెబ్బేరులో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అందులో ప్రస్తుతానికి ఫిషరీస్ కాలేజీ స్టూడెంట్లకు ట్రైనింగ్ ఇస్తున్నారు. అయితే మూడెకరాల విస్తీర్ణంలో ఉన్న మదనాపూర్ ఉత్పత్తి కేంద్రాన్ని వినియోగంలోకి తెచ్చి ఉంటే 5 లక్షల చేపపిల్లలు ఉత్పత్తి అయ్యేవని ట్రైనీలు అభిప్రాయపడుతున్నారు.
పంపిణీకి బదులు నగదుపై ఆసక్తి..
మత్స్య శాఖ నుంచి పంపిణీ చేసే చేప పిల్లలకు బదులు తమకు నగదు ఇస్తే బాగుంటుందని మత్స్యకారులు అంటున్నారు. విత్తనానికి సరిపడా నగదు ఇస్తే తామే నాణ్యమైన సీడ్ పిల్లలు తెచ్చుకుంటామని మత్స్య పారిశ్రామిక సంఘాలు కోరుతున్నాయి. ఈ మేరకు ఇటీవల కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి వినతిపత్రం కూడా సమర్పించారు. గతంలో నాణ్యత లేని, చిన్న సైజు పిల్లలు ఇవ్వడం వాటిలో చాలా వరకు చనిపోయాయని వారంటున్నారు. చెరువులు, కుంటల్లో నీరు ఇంకే ఎండాకాలం నాటికి అవి సరిగ్గా పెరగకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోయామని మత్స్యకార్మికులు వాపోతున్నారు. ఈ సారి సంఘాలకు నగదు ఇస్తే తామే నాణ్యమైన విత్తనాలను తెచ్చుకుంటామని చెబుతున్నారు. విత్తనాలను ఏపీలోని విజయవాడ ప్రాంతాల్లో ప్రైవేటు ఫిష్ సీడ్ డీలర్ల నుంచి తెచ్చుకుంటారు. గతంలో కొన్ని జిల్లాల్లో చేప పిల్లల పంపిణిలో కాంట్రాక్టర్లు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి.
పంపిణీకి సన్నాహాలు చేస్తున్నాం
చేప పిల్లల పంపిణీకి సన్నాహాలు చేస్తున్నాం. ఈ ఏడాది రెండు కోట్ల చేప పిల్లలను వదలాలని టార్గెట్గా పెట్టుకున్నాం. అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేశాం. మత్స్యకారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నాణ్యమైన విత్తనాలే పంపిణీ చేస్తాం.
లక్ష్మప్ప, జిల్లా ఫిషరీస్ ఏడీ, వనపర్తి