భద్రాచలం, వెలుగు: ఛత్తీస్గఢ్ దండకారణ్యంలోని బస్తర్ ప్రాంతానికి చెందిన మావోయిస్టు కీలక కమాండర్ పాపారావు(56) అలియాస్ మంగూ అలియాస్ సున్నం చంద్రయ్య మంగళవారం తన సహచరులతో కలిసి సరెండర్ అయ్యారు. ఓ జర్నలిస్టు ద్వారా బీజాపూర్ జిల్లా కుట్రూ పోలీస్స్టేషన్కు తన వద్ద ఉన్న ఏకె-47 ఆయుధం, 17 మంది నక్సల్స్ తో వచ్చారు. అక్కడి నుంచి జగదల్పూర్కు ప్రత్యేక బస్సులో వారిని తరలించారు. హిడ్మా, దేవా తర్వాత బస్తర్ దండకారణ్యంలో పాపారావు కీలకమైన నేత.
అనేక ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్న ఆయన భద్రతా బలగాలపై అనేక సార్లు దాడులు చేశారు. దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్గా ఉన్న ఆయన ప్రస్తుతం పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీ ఇన్చార్జి కమాండర్గా వ్యవహరిస్తున్నారు. ఇతనిపై రూ.25 లక్షల రివార్డు ఉంది. పాపారావు లొంగుబాటుతో బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయినట్లేనని డిప్యూటీ సీఎం విజయ్శర్మ పేర్కొన్నారు. పాపారావు వంటి కీలక నేతలు లొంగిపోవడం సానుకూల సంకేతమని ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్సాయి ఒక ప్రకటనలో తెలిపారు. లొంగిపోయిన వారిలో డివిజనల్ కమిటీ మెంబర్లు ప్రకాశ్ మడావి, అనిల్ తాతీ ఉన్నారు. సరెండర్ అయిన 18 మందిలో ఏడుగురు మహిళా మావోయిస్టులు ఉండగా, 8 ఏకే-47లు, ఒక ఎస్ఎల్ఆర్, ఒక ఇన్సాస్తో పాటు ఇతర ఆయుధాలను వారు అప్పగించారు.
