వడ్లే వడ్లు..ఓరుగల్లులో ధాన్యం కొనుగోళ్లు డబుల్‍  

వడ్లే వడ్లు..ఓరుగల్లులో ధాన్యం కొనుగోళ్లు డబుల్‍  
  • ఉమ్మడి జిల్లాలో 8 లక్షల 41 వేల మెట్రిక్‍ టన్నుల ధాన్యం సేకరణ 
  • 6 జిల్లాల్లో అందుబాటులో 1,237 కొనుగోళ్ల సెంటర్లు 

వరంగల్‍/ జనగామ, వెలుగు: ఎన్నడూ లేనివిధంగా ఓరుగల్లులో ధాన్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో జరిగాయి. ఉమ్మడి ‌ జిల్లాలో ఈసారి 1,237 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయగా, జూన్‍ 10 నాటికి 8,41,541 మెట్రిక్‍ టన్నుల ధాన్యం సేకరించారు. గత సీజన్‍తో పోలిస్తే యాసంగిలో ఉమ్మడి వరంగల్‍ జిల్లాల్లో ధాన్యం సేకరణ దాదాపు 70 శాతం నుంచి 100 శాతానికి పెరిగింది.

యాసంగిలో రైతులు ఏ పంటవైపు మొగ్గుచూపుతున్నారనే విషయాన్ని ముందే గుర్తించిన అధికారులు అంతేస్థాయిలో కొనుగోలు సెంటర్లు ఏర్పాట్లు చేశారు. సకాలంలో ధాన్యం సేకరణ జరగాలని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్​గా వ్యవహరించడంతో 6 జిల్లాల కలెక్టర్లు రెగ్యూలర్‍ సమీక్షలు చేపట్టి కొనుగోలు కేంద్రాల వద్ద తనిఖీలు నిర్వహించారు. మొత్తంగా భూపాలపల్లి మినహాయిస్తే.. రైతుల ఖాతాల్లో రూ.4,559.95 కోట్ల  ధాన్యం డబ్బులు జమ చేశారు.

వరంగల్‍ జిల్లాలో డబుల్‍ ధాన్యం..

ఉమ్మడి వరంగల్‍ పరిధిలో చూస్తే వరంగల్‍ జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ 100 శాతం కంటే ఎక్కువగా పెరిగింది. గత సీజన్లో 89 వేల మెట్రిక్‍ టన్నుల ధాన్యం సేకరిస్తే, ఈసారి అధికారులు 2 లక్షల మెట్రిక్‍ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం పెట్టుకున్నారు. ఈమేరకు 187 సెంటర్ల ద్వారా జూన్‍ 10 నాటికి 1,81,785 మెట్రిక్‍ టన్నుల సేకరణ జరిగింది. జనగామ జిల్లాలో గత సీజన్‍లో 1,26,000ల మెట్రిక్‍ టన్నుల సేకరణ జరగగా, ప్రస్తుతం 300 సెంటర్ల ద్వారా 2 లక్షల 35 వేల లక్ష్యం పెట్టుకుని, 1,73,941 మెట్రిక్‍ టన్నులు  సేకరించారు.

హనుమకొండలో గత సీజన్‍లో 75,960 మెట్రిక్‍ టన్నుల సేకరణ జరగగా, ఈసారి లక్షా 57 వేలు టార్గెట్‍ పెట్టుకుని 1,27,631 మెట్రిక్‍ టన్నులను సేకరించారు. ములుగు జిల్లాలో గతంలో 43,429 మెట్రిక్‍ టన్నులు ఉండగా, ఈసారి 92,113 టార్గెట్‍ పెట్టుకుని, 150 కొనుగోలు సెంటర్ల ద్వారా 81,874 మెట్రిక్‍ టన్నులు సేకరించారు. మహబూబాబాద్‍ జిల్లాలో 239 సెంటర్ల ద్వారా లక్షా 70 వేల టార్గెట్‍ పెట్టుకుని, 1,76,101 వేల మెట్రిక్‍ టన్నులను సేకరించారు. భూపాలపల్లి జిల్లాలోనూ లక్షా 209 మెట్రిక్‍ టన్నులు లక్ష్యం పెట్టుకోగా, 204 కేంద్రాల ద్వారా 1,00,209​ టన్నుల ధాన్యాన్ని 
సేకరించారు. 

రైతుల ఖాతాల్లోకి డబ్బులు..

ఉమ్మడి జిల్లాలో ధాన్యం సేకరణ ఎంత వేగంగా జరిగిందో అంతే స్పీడుతో అధికారులు ధాన్యం డబ్బులు చెల్లిస్తున్నారు. వరంగల్‍ జిల్లాలో రైతుల ధాన్యానికి సంబంధించి రూ.421 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటికీ రూ.385 కోట్లు ఖాతాల్లో వేశారు. జనగామలో రూ.381.16 కోట్లకు రూ.373.79 కోట్లు, మహబూబాబాద్‍లో రూ.321.20 కోట్లు చెల్లింపులు జరుగగా, కేవలం రూ.23 కోట్లు మాత్రమే పెండింగ్‍ ఉంది. హనుమకొండలో రూ.281 కోట్ల 16 లక్షలు, ములుగు జిల్లాలో రూ.167 లక్షల చెల్లింపులు జరిగాయి. భూపాలపల్లి జిల్లాలో రూ.142 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. తద్వారా ఉమ్మడి ఆరు జిల్లాల్లో రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యానికి జూన్‍ 10 నాటికి ప్రభుత్వం రూ.4,559.95 కోట్ల చెల్లింపులు చేశారు.

ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలి

హనుమకొండ/ హనుమకొండ సిటీ, వెలుగు: ఆపదలో ఉన్నవారికి సహాయం చేసేందుకు ఆపదమిత్ర వలంటీర్లు ఎల్లప్పుడూ ముందుండాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో హనుమకొండలోని అంబేద్కర్​ భవన్​లో నిర్వహించిన ఆపదమిత్ర వలంటీర్ల శిక్షణ ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రకృతి విపత్తులతో పాటు  రోడ్డు ప్రమాదాల సమయంలోనూ బాధితులకు సహాయం చేయాలన్నారు. డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ నాగరాజు మాట్లాడుతూ జిల్లాలో 257 మందికి ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలిపారు.

ఆపదమిత్ర వలంటీర్లకు సర్టిఫికెట్లు, ఐడీ కార్డులను కలెక్టర్ అందజేశారు.  అంతకుముందు కలెక్టరేట్​లో ఇసుక, కంకర, ఖనిజ వనరులకు సంబంధించి ఆన్​లైన్​ జీరో పర్మిట్​ సిస్టమ్​, టీజీఎండీసీ ద్వారా ఇసుక అనుమతులు తీసుకునే విధానంపై సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జీరో పర్మిట్​ విధానంలో అనుమతులు తీసుకునేలా కాంట్రాక్టర్లకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. జిల్లాలోని ధర్మసాగర్, ఆత్మకూర్, హసన్​పర్తి మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం సాండ్​ బజార్​ కోసం 5 ఎకరాల స్థలాన్ని గుర్తించి ఏర్పాటు చేయించాలని సూచించారు.​​