ప్రధాని దిష్టిబొమ్మ కాలుస్తుంటే వేడుక చూసిన ఏసీపీ

ప్రధాని దిష్టిబొమ్మ కాలుస్తుంటే వేడుక చూసిన ఏసీపీ

వరంగల్, వెలుగు: వరంగల్​లో దేశ ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేస్తుంటే అడ్డుకోవాల్సిన ఏసీపీ గిరికుమార్‍ ఎమ్మెల్యేకు సెల్యూట్​ కొట్టి  మరీ వేడుక చూశారు. మొయినాబాద్​ ఫాంహౌస్​ ఘటనకు నిరసనగా గురువారం తూర్పు ఎమ్మెల్యే నరేందర్‍ ఆధ్వర్యంలో టీఆర్ఎస్​ శ్రేణులు వరంగల్​ చౌరస్తాలో ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మ దహనానికి పిలుపునిచ్చారు. ముందస్తు సమాచారం మేరకు ఏసీపీ గిరికుమార్‍, సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లతో అక్కడికి చేరుకున్నారు. ఈలోగా దిష్టిబొమ్మను దహనం చేయడానికి వచ్చిన నరేందర్‍కు ఏసీపీ సెల్యూట్‍ కొట్టి పక్కన ఎస్కార్ట్​లా నిల్చున్నారు.

ఆర్‍ఎస్‍ లీడర్లు దిష్టిబొమ్మ తెస్తున్నా.. ఏసీపీ, ఇతర పోలీసులుగానీ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.  ఇంకో అడుగు ముందుకేసి దిష్టిబొమ్మ దహనం కొనసాగుతున్నంతసేపు టీఆర్ఎస్​ నేతలకు సపోర్ట్​గా పోలీస్‍ పెద్దలే ట్రాఫిక్‍ను మళ్లించారు. అదే ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఏదైనా కార్యక్రమం చేపడితే మాత్రం పోలీసులు అడ్డుకుంటుండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వరంగల్‍ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ ​మగ్గంపై కాలు వేశారనే ఆరోపణలతో మంగళవారం చేనేత కార్మికులు దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించారు. ఏసీపీ గిరికుమార్‍ సిబ్బంది సాయంతో అడ్డుకొని, అందరినీ వాహనాల్లో పడేసి స్టేషన్​కు తరలించారు.  గతంలో బీజేపీ, కాంగ్రెస్‍, సీపీఐ, సీపీఐ, కుల, ప్రజా సంఘాలు నిరసనలు తెలిపినప్పుడు కూడా  ఏసీపీ తన ప్రతాపం చూపారు. పార్టీల రాజకీయ విభేదాల సంగతెలా ఉన్నా  ఒక ఉన్నతాధికారిగా ప్రధాని దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.