
- కొండా దంపతులు వర్సెస్ మిగతా లీడర్లుగా మారిన పరిస్థితి
- ఎమ్మెల్యే నాయిని నివాసంలో.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మేయర్ భేటీ
- కొండా మురళి వ్యాఖ్యలపై మండిపడ్డ నేతలు
- ఆయనపై హైకమాండ్కు ఫిర్యాదు చేస్తామన్న ఎమ్మెల్యేలు
వరంగల్, వెలుగు : మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి రెండు రోజుల కింద చేసిన వ్యాఖ్యలు ఓరుగల్లు కాంగ్రెస్లో కాక పుట్టించాయి. రాహుల్గాంధీ జన్మదినం సందర్భంగా గురువారం వరంగల్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కొండా మురళి.. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో పాటు మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును చివరకు వరంగల్ సీపీని సైతం నిందించడం కలకలం రేపింది.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మేయర్, పార్టీ అధ్యక్షుడు శుక్రవారం ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి ‘కొండా’ పై ఫైర్అయ్యారు. ఆయనను భరించడం ఇక తమ వల్ల కాదని, హైకమాండ్ వద్ద తాడోపేడో తేల్చుకుంటామని ప్రకటించారు.
కొండా దంపతులు ఓ గ్రూప్.. మిగతా నేతలంతా మరో గ్రూప్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండగా జనగామ మినహా 11 చోట్ల కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లే గెలిచారు. గ్రేటర్ పరిధిలోని వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కొండా సురేఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కొండా సురేఖ దంపతులకు, మిగిలిన కాంగ్రెస్ నేతలకు మొదటి నుంచీ సత్సంబంధాలు లేవు. కొండా సురేఖ మంత్రి అయ్యాక కూడా వీరి మధ్య సఖ్యత కుదరలేదు.
దీంతో కొండా దంపతులు ఒక వైపు ఉండగా.. వారి నియోజకవర్గం చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు మరో గ్రూప్గా కొనసాగుతున్నారు. గతంలో సురేఖ ప్రాతినిధ్యం వహించిన పరకాల నుంచి ఈ సారి కాంగ్రెస్ తరఫున రేవూరి ప్రకాశ్రెడ్డి గెలిచారు. రిజల్ట్ వచ్చిన తెల్లారినుంచే ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ మొదలైంది. గీసుగొండ పోలీస్స్టేషన్ వేదికగా ఇద్దరూ ఘర్షణపడ్డారు. ఆ తర్వాత సురేఖ.. రేవూరికి ఫోన్ చేసి మాట్లాడిన ఆడియోలు పార్టీలో, జిల్లాలో హల్చల్ చేశాయి.
సిటీలో ఉండే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డితో సైతం ఢీ అంటే ఢీ అంటున్నారు. మంత్రి తన నియోజకవర్గంలో రాజకీయాలు చేయొద్దని నాయిని పలుమార్లు ఓపెన్గానే చెప్పారు. ఇటీవల ఏనుగులగడ్డ బస్టాండ్ అంశంతో పాటు భద్రకాళి అమ్మవారికి బోనం సమర్పించే విషయంలోనూ ఇరువురూ చెరో దారిలో వెళ్లారు. తన నియోజకవర్గంలో అనవసర రాజకీయాలు చేస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ సైతం కొండా దంపతులపై కోపంగానే ఉన్నారు. మాజీమంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో ఎప్పటినుంచో వైరం ఉంది.
ఇప్పుడు నియోజకవర్గంలో ఏ ఇష్యూ జరిగిన ఇరువర్గాలకు పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కుతున్నాయి. గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి సురేఖ నియోజకవర్గంలో ఉండడం, మహిళా నేత కావడంతో ఆమెతోనూ సఖ్యత లేదు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డితో పాటు చివరకు పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ సైతం కొండా దంపతుల వ్యతిరేక గ్రూప్గా
ఉన్నారు.
ఇష్టమున్నట్లు మాట్లాడి బీసీ కార్డ్ వాడితే పాపాలు పోవు
ప్రభుత్వంలో, పార్టీలో బాధ్యత కలిగిన పదవుల్లో ఉండి ఇష్టం ఉన్నట్లు మాట్లాడి, తర్వాత బీసీ కార్డ్ వాడితే పాపాలు పోవని కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. కొండా మురళి సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై విమర్శలు చేసిన నేపథ్యంలో స్టేషన్ఘన్పూర్, పరకాల, వర్ధన్నపేట, భూపాలపల్లి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్.నాగరాజు, గండ్ర సత్యనారాయణతో పాటు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే నాయిని క్యాంపు ఆఫీస్లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మీడియాతో మాట్లాడుతూ.. జిల్లానుంచి బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్న వ్యక్తులు ప్రతి నియోజకవర్గంలో ఒక లొల్లి పెడుతున్నారని మండిపడ్డారు. వారి పాపాలను భరించలేకపోతున్నామన్నారు. సీనియర్లు, అనుభవం ఉన్నోళ్లు ఎక్కడపడితే అక్కడ నోటికొచ్చినట్లు మాట్లాడుతామంటే పార్టీ క్షమించబోదన్నారు. బహిరంగంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడి తర్వాత బీసీ, రెడ్డి, ఎస్సీ కార్డు అడ్డుపెట్టుకుంటామంటే నడవదని హెచ్చరించారు. ఏదైనా మంచి, చెడు ఉంటే పార్టీ పెద్దలకు చెప్పుకోవాలి తప్పితే.. ఇష్టమున్నట్లు చేయొద్దని హైకమాండ్ ఆదేశించడంవల్లే తాము గీత దాటడం లేదన్నారు.
సీఎం రేవంత్రెడ్డి ఓ వైపు ఓరుగల్లుకు కోట్లాది రూపాయలు కేటాయిస్తూ అభివృద్ధికి సహకరిస్తుంటే... ఇలాంటి లీడర్ల వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం కలుగుతోందన్నారు. కొండా దంపతుల తీరుపై హైకమాండ్కు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు. కాగా సమావేశం మధ్యలో గుండు సుధారాణి బయటకు వెళ్లడం కూడా కాసేపు చర్చకు దారీ తీసింది.