వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు

వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు

హనుమకొండ సిటీ, వెలుగు : హనుమకొండ జిల్లా కోర్టులో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌‌‌‌ చేయడంతో అలర్ట్‌‌‌‌ అయిన ఆఫీసర్లు తనిఖీలు చేపట్టగా చివరకు బాంబు లేదని తేలింది. వివరాల్లోకి వెళ్తే... గుర్తు తెలియని ఓ వ్యక్తి శుక్రవారం 100కు ఫోన్‌‌‌‌ చేసి హనుమకొండలోని అదాలత్‌‌‌‌లో ఉన్న వరంగల్, హనుమకొండ జిల్లాల కోర్టు ప్రాంగణంలో బాంబు ఉన్నట్లు చెప్పాడు. దీంతో అలర్ట్‌‌‌‌ అయిన సుబేదారి సీఐ రంజిత్‌‌‌‌కుమార్‌‌‌‌ పోలీసులు, డాగ్‌‌‌‌, బాంబ్‌‌‌‌ డిస్పోజల్‌‌‌‌ స్క్వాడ్‌‌‌‌తో కోర్టు ప్రాంగణానికి చేరుకొని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

చివరకు ఎలాంటి బాంబు కనిపించకపోవడంతో ఫేక్‌‌‌‌ కాల్‌‌‌‌ నిర్ధారించారు. ఇదిలా ఉండగా... ఆత్మకూర్ పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ పరిధిలో విచారణ ముగిసిన ఓ కేసుకు సంబంధించి కోర్టు ఆవరణలో భద్రపరిచిన ఆరు డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాంబు బెదిరింపు కాల్‌‌‌‌కు, ఈ డిటోనేటర్లకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తెలిపారు. గతంలో రెండు సార్లు ఇదే కోర్టులో బాంబు పెట్టినట్లు ఫేక్ మెయిల్ ఐడీతో మెయిల్స్‌‌‌‌ వచ్చాయి. బాంబు ఉన్నట్లు ఫోన్‌‌‌‌ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.