- వరంగల్ న్యూ శాయంపేట డబుల్బెడ్రూం ఇండ్ల పంపిణీకి వారంలో ముహూర్తం
- నెరవేరనున్న 600 మంది లబ్ధిదారులకు సొంతింటి కల
- హాజరవనున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- హనుమకొండ జిల్లా కమలాపూర్, గూడూర్లో 352 ఇండ్ల పంపిణీకి సిద్ధం
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మరోసారి డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి రంగం సిద్ధమవుతోంది. రాబోయే వారం నుంచి పది రోజుల్లో రెండో దశ ఇండ్ల పంపిణీ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేయనున్నది. తొమ్మిది నెలల కింద స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మొదటి దశలో లబ్ధిదారులకు ఇండ్లు అందజేయగా, ఇప్పుడు వరంగల్ పశ్చిమ పరిధిలోని న్యూశాయంపేటలో నిర్మించిన మరో విడత ఇండ్ల పంపిణీకి సిద్ధమయ్యారు. సొంతింటి కల నెరవేరుతుందనే ఆశతో లబ్ధిదారులు ఎదురుచూస్తుండగా, అధికార యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమైంది.
ఆగస్టులో 592 డబుల్ ఇండ్లు.. ఇప్పుడు మరో 600
గ్రేటర్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రెండోసారి డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ జరగనుంది. హనుమకొండలోని ఏషియన్ మాల్ సమీపంలో నాలుగు అంతస్తుల్లో 37 బ్లాకుల్లో మొత్తం 592 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. ఒక్కో బ్లాక్లో 16 ఇండ్ల చొప్పున ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి తమ గుడిసెలను కోల్పోయిన 341 కుటుంబాలకు తొలి ప్రాధాన్యం ఇచ్చారు.
అనంతరం పేదరిక ప్రమాణాల ఆధారంగా ఇతర అర్హులకు అవకాశం కల్పించారు. గతేడాది ఆగస్టు 8న కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి కలిసి లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ప్రస్తుతం హనుమకొండ న్యూశాయంపేటలో రైల్వే ట్రాక్ సమీపంలో నిర్మించిన సుమారు 600 డబుల్ బెడ్రూం ఇండ్లను కూడా పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఇండ్ల కోసం గతంలోనే దరఖాస్తులు స్వీకరించగా, గత ఆరు నుంచి ఏడు నెలలుగా కలెక్టర్ ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు.
కమలాపూర్, గూడూరులోనూ పంపిణీకి సన్నాహాలు..
గ్రేటర్ వరంగల్లో రెండో దశ ఇండ్ల పంపిణీతో పాటు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రం, గూడూరు ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను కూడా పంపిణీ చేయనున్నారు. కమలాపూర్లో 302 ఇండ్లు, గూడూర్లో 50 ఇండ్లు నిర్మించగా, మొత్తం 352 ఇండ్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఇటీవల ఈ ఇండ్లను పరిశీలించి, పంపిణీ ప్రక్రియకు సంబంధించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.
డ్రా పద్ధతిలోనే ఇండ్ల కేటాయింపు..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2015లో వరంగల్ సిటీలో పర్యటన సందర్భంగా అప్పటి సీఎం కేసీఆర్ అంబేద్కర్నగర్, జితేందర్నగర్ కాలనీలను సందర్శించి గుడిసెవాసులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం 2019 నాటికి ఇండ్ల నిర్మాణం పూర్తయింది. అయితే, ఇండ్ల కేటాయింపుల సమయంలో అప్పటి బీఆర్ఎస్ లీడర్లపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి.
డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపుల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో పలువురిపై పోలీసు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా ప్రస్తుత ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ సమక్షంలో పారదర్శకంగా లక్కీ డ్రా పద్ధతిలో ఇండ్లు కేటాయించారు. న్యూశాయంపేటలో నిర్మించిన రెండో దశ డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కూడా ఇదే విధానంలో నిర్వహించనున్నారు.
