
- ముందస్తు చర్యల కోసం వరంగల్ పోలీసుల నంబర్
- నకిలీలపై పీడీ యాక్ట్ నమోదు చేస్తాం : సీపీ సన్ప్రీత్సింగ్
- ఇప్పటికే రూ.కోటి 23 లక్షల స్టాక్, 14 మంది నిందితుల అరెస్ట్
వరంగల్, వెలుగు: వరంగల్ పోలీస్ కమిషనరేట్లో నకిలీ విత్తనాలు, ఎరువులు, మందులు విక్రయించేవారిపై 77998 48333 కు ఫిర్యాదు చేయాలని సీపీ సన్ప్రీత్సింగ్ రైతులు, జనాలకు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో రైతులను మోసం చేస్తున్న నకిలీల ఆటకట్టించడానికి ముందస్తు చర్యల కోసం వరంగల్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోస్టర్ను మంగళవారం సీపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాలు, ఎరువులు, మందుల తయారీ, విక్రయాలపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు.
ఇప్పటికే రూ.కోటి 23 లక్షల విలువ చేస్తే సీడ్స్, మందులు స్వాధీనం చేసుకుని 14 మంది నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపించామన్నారు. నకిలీ విక్రయాల నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సీపీ వార్నింగ్ ఇచ్చారు. ఫిర్యాదు చేసేవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. పోస్టర్ ఆవిష్కరణలో అడిషనల్ డీసీపీ రవి, డీసీపీ జితేందర్రెడ్డి, డేవిడ్ రాజ్, ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్ పాల్గొన్నారు.