
గ్రేటర్ వరంగల్ రోడ్లపై డుగ్..డుగ్ మంటూ విపరీత శబ్దాలు చేసే సైలెన్సర్లను వాడొద్దని హనుమకొండ ట్రాఫిక్ పోలీసులు యువతను రెక్వెస్ట్ చేశారు. బైకుతోపాటు వచ్చే ఒరిజినల్ సైలెన్సర్ల మార్చి జనాలను ఇబ్బందులకు గురిచేసే సైలెన్సర్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు హనుమకొండ ట్రాఫిక్ సీఐ సీతారెడ్డి తెలిపారు.
అయినా కొందరు తమ ప్రవర్తన మార్చుకోకపోవడంతో వినూత్న ఆలోచన చేశారు. వివిధ పనులరీత్యా రోడ్లపైకొచ్చేవారిని ఆలోజింపజేసేలా కేయూ, తదితర జంక్షన్లలో 'యానిమల్' సినిమాలో బాంబులు కురిపించే యుద్ధ ట్యాంకుల మాదిరి వారు గతంలో పట్టుకున్న సైలెన్సర్లతో స్టాండ్ ఏర్పాటు చేశారు. సౌండ్ పొల్యూషన్ తగ్గించి, పర్యావరణం, సమాజ హితానికి తోడ్పాటు అందించాలని ఫ్లెక్సీల ద్వారా మరోసారి రెక్వెస్ట్ చేస్తున్నారు. వాహన ధ్వని కాలుష్య సెక్షన్ 190(2), 1988 మోటార్ వెహికల్ చట్టం ప్రకారం బైకులకు మార్చిన సైలెన్సర్లతో రోడ్లపై శబ్దం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. - వరంగల్, వెలుగు