
- నిందితుడి అరెస్ట్, 11.16 తులాల బంగారు నగలు స్వాధీనం
- ఖిలా వరంగల్ పడమర కోటలో ఘటన
వరంగల్/ఖిలా వరంగల్, వెలుగు: కాలేజీలో పరిచయమైన గర్ల్ ఫ్రెండ్తో జల్సాలు చేయడానికి ఏకంగా ఓ యువకుడు సొంత ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి 11.16 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిలా వరంగల్ పడమర కోటకు చెందిన గుర్రపు జయంత్(23) హనుమకొండలోని ఓ కాలేజీలో బీబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.
ఇదే కాలేజీలో అతడికి ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమెతో జల్సాగా తిరిగేవాడు. ఆపై హైదరాబాద్లో ఓ ఫుడ్ కోర్ట్ పెట్టి నష్టపోయాడు. ఓ వైపు ఎంజాయ్ చేయడానికి డబ్బులు అవసరం ఉండగా..మరోవైపు అప్పులు తీర్చాల్సి ఉండడంతో తన ఇంట్లోనే చోరీ చేయాలని స్కెచ్ వేశాడు. ఈ నెల 8న కుటుంబ సభ్యులు హైదరాడాద్లోని ఓ ఫంక్షన్కు వెళ్లారు. జయంత్ దీనిని తనకు అనుకూలంగా మార్చుకుని, ఇంట్లోని 16 తులాల బంగారు అభరణాలను చోరీ చేశాడు. అదేరోజు రాత్రి ఫంక్షన్ నుంచి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించారు.
జయంత్ తండ్రి గుర్రపు రామకృష్ణ స్థానిక మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఏసీపీ నందిరాం నాయక్, సీఐ బొల్లం రమేశ్ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం పోలీసుల రాకను చూసి జయంత్ పారిపోయే ప్రయత్నం చేయగా.. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు గుట్టు బయటపడింది. నిందితుడి నుంచి 11.16 తులాల అభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కేసులో ప్రతిభ చూపిన ఇన్స్పెక్టర్ రమేశ్తో పాటు ఎస్సైలు శ్రీకాంత్, సురేశ్, సిబ్బంది ప్రవీణ్రెడ్డి, వాజీద్ పాషా, నరేందర్, రఫీని ఏసీపీ అభినందించారు.